విజయనగరం టౌన్: పోలీసు కానిస్టేబుళ్ల శిక్షణ ముగింపు సందర్భంగా జిల్లా పోలీసు పరేడ్ మైదానంలో ఈ నెల 7వ తేదీన నిర్వహించనున్న పాసింగ్ అవుట్ పరేడ్ రిహార్సల్స్ను ఎస్పీ ఎఆర్.దామోదర్ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కానిస్టేబుళ్లు క్రమశిక్షణ, సమయపాలన, విధి నిర్వహణలో అత్యున్నత ప్రమాణాలను పాటించాలని సూచించారు. పాసింగ్ అవుట్ పరేడ్లో భాగంగా నిర్వహించిన కవాతు, ప్లాటూన్ల కదలికలు, కమాండ్లకు స్పందన, మార్చింగ్ పద్ధతి తదితర అంశాలను నిశితంగా పరిశీలించారు. రిహార్సల్స్లో పాల్గొన్న శిక్షణార్ధుల పరేడ్ తీరును పరిశీలించి, అవసరమైన సూచనలు, సలహాలను అందించారు. పరేడ్లో ప్రతి ఒక్కరూ సమన్వయంతో, పూర్తి క్రమశిక్షణతో పాల్గొనాలన్నారు. పోలీసు కానిస్టేబుల్గా బాధ్యతలు స్వీకరించడం గొప్ప అవకాశమని, శిక్షణలో జ్ఞానం, నైపుణ్యాలను విధి నిర్వహణలో సమర్ధవంతంగా వినియోగించాలని సూచించారు. ప్రజలతో మర్యాదగా వ్యవహరించడం, బాధితుల సమస్యలను సానుభూతితో వినడం, చట్టాన్ని నిష్పక్షపాతంగా అమలు చేయడం ప్రతి పోలీస్ సిబ్బంది ప్రధాన కర్తవ్యమన్నారు. పాసింగ్ అవుట్ పరేడ్ను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని సంబంధిత అధికారులను ఎస్పీ ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, ఏఆర్ డీఎస్పీ ఇ.కోటిరెడ్డి, శిక్షణా సిబ్బంది, పోలీసు అధికారులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.


