ఫార్మర్ రిజిస్ట్రీ లేకుంటే.. పీఎం కిసాన్ కట్..!
● భవిష్యత్తులో ఎరువులు, పంటల
బీమా అందవు
● జిల్లాలో ఫార్మర్ రిజిస్ట్రీకి దూరంగా
48 వేల మంది రైతులు
విజయనగరం ఫోర్ట్: ప్రభుత్వ కొత్త నిబంధనల ప్రకారం ప్రతీరైతు ఫార్మర్ రిజిస్ట్రీ యాప్లో పేరు, భూముల వివరాలు నమోదు చేసుకోవాలి. లేదంటే పీఎం కిసాన్తో పాటు ఎరువులు అందవు. రైతు సంక్షేమ పథకాలు మంజూరు కావు. రైతుల్లో నిరక్షరాస్యత, వ్యవసాయ సిబ్బంది అలసత్వంతో జిల్లాలో సుమారు 48 వేల మంది రైతుల వివరాలు నమోదు కాలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రైతులకు పథకాల్లో కోతపెట్టేందుకే ప్రభుత్వం ఏదో ఒక కారణం తెరపైకి తెస్తోందని రైతులు విమర్శిస్తున్నారు.
ఫార్మర్ రిజిస్ట్రీ తప్పనిసరి
ఫార్మర్ రిజిస్ట్రీ చేయించుకోకపోతే రైతులకు ప్రధానమంతి కిసాన్ సమ్మాన్ నిధి కింద ఏడాదికి ఇచ్చే రూ. 6 వేలు అందవు. పంటల బీమా వర్తించదు. ప్రభుత్వ పథకాలు వర్తించవు. ఎరువులు కూడా ఇవ్వరు. నిరక్షరాస్యులైన రైతులు ఫార్మర్ రిజిస్ట్రీ నమోదులో వెనుకబడి ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే అన్నదాత సుఖీభవ పథకం కౌలురైతులకు అందడంలేదు. ఎరువుల కోసం నానా తిప్పలు పడుతున్నారు. ఇప్పుడు ఈ కొత్తనిబంధనతో ఇబ్బందులు తప్పవని రైతులు వాపోతున్నారు. భూములు ఉన్నా రీ సర్వే పూర్తికాకపోవడంతో ఒన్బీలు రావడంలేదని, తామంతా పథకానికి దూరమవుతామంటూ మరికొందరు రైతులు ఆవేదన చెందుతున్నారు.
ప్రతీ రైతుకు
11 అంకెలతో కూడిన
డిజిటల్ ఐడీ..
నమోదు తప్పనిసరి
జిల్లాలో 48 వేల మంది రైతులు ఫార్మర్ రిజిస్ట్రీ చేయించుకోలేదు. వ్యవసాయ సిబ్బంది రైతులందరికీ ఫార్మర్ రిజిస్ట్రీ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఫార్మర్ రిజిస్ట్రీ లేకపోతే పీఎం కిసాన్, ప్రభుత్వ పథకాలు, పంటల బీమా కూడా ఇవ్వరు.
– వి.తారకరామారావు,
జిల్లా వ్యవసాయ అధికారి
ఫార్మర్ రిజిస్ట్రీ చేసుకున్న ప్రతీ రైతుకు 11 అంకెలతో కూడిన డిజిటల్ ఐడీ వస్తుంది. ఈ ఐడీ ఎంటర్ చేయగానే రైతుకు సంబంధించిన పూర్తి వివరాలు వచ్చేస్తాయి. రైతులు పట్టాదారు పాసుపుస్తకం, ఆధార్ నంబర్, అధార్ నంబర్తో లింక్ అయిన ఫోన్ నంబర్ను విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ దగ్గరకు పట్టుకుని వెళితే రైతుకు ఫార్మర్ రిజిస్ట్రీ నమోదుచేసి ఐడీ ఇస్తారు. జిల్లాలో 2,77,011 మంది రైతులు ఫార్మర్ రిజిస్ట్రీ చేయించుకోవాల్సి ఉంది. ఇంతవరకు 2,29,011 మంది రైతులు ఫార్మర్ రిజిస్ట్రీ చేయించుకున్నారు. 48 వేలు మంది ఇంకా చేయించుకోవాల్సి ఉంది.
ఫార్మర్ రిజిస్ట్రీ లేకుంటే.. పీఎం కిసాన్ కట్..!


