లక్ష్య శుద్ధితోనే వృత్తి నైపుణ్యం
● పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ
మాధవ్రెడ్డి
● పోలీసుల వార్షిక ఫైరింగ్ ప్రాక్టీస్
పార్వతీపురం రూరల్: జిల్లా పోలీసు అధికారులు, ఆర్మడ్ రిజర్వ్ (ఏఆర్) సిబ్బందికి వార్షిక ఫైరింగ్ ప్రాక్టీస్ను సోమవారం నెల్లిమర్ల మండలం సారిపల్లిలోని పోలీసు శిక్షణ కేంద్రంలో నిర్వహించారు. కార్యక్రమానికి పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ ఎస్.వి.మాధవ్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, సిబ్బంది ఫైరింగ్ తీరును పర్యవేక్షించడంతో పాటు స్వయంగా పాల్గొని లక్ష్యాలను ఛేదించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విధి నిర్వహణలో ఎదురయ్యే అత్యవసర పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి, ఆయుధాల వినియోగంలో నైపుణ్యం పెంపొందించుకోవడానికి వార్షిక శిక్షణ దోహదపడుతుందన్నారు. పోలీస్ సిబ్బంది మానసిక ఒత్తిడిని జయించి, పూర్తి ఏకాగ్రతతో లక్ష్యాన్ని ఛేదించాలని సూచించారు. ఆధునిక ఆయుధాల నిర్వహణపై పట్టు సాధించడం వల్ల వృత్తిపరమైన ఆత్మవిశ్వాసం పెరుగుతుందని పేర్కొన్నారు. అనంతరం ఎస్పీ మాధవ్రెడ్డి గ్లాక్ పిస్టల్, ఎంపీ–5 వంటి అత్యాధునిక ఆయుధాలతో ఫైరింగ్ చేయగా, ఏఆర్ బలగాలు ఏకే–47, ఎస్ఎల్ఆర్ తుపాకులతో సాధన చేశారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు, పాలకొండ డీఎస్పీ రాంబాబు, ఏఆర్ డీఎస్పీ థామస్ రెడ్డి, ఆర్ఐలు నాయుడు, రాంబాబు, పలువురు సీఐలు, ఎస్సైలు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
గ్లాక్ పిస్టల్,
ఎంపీ–5
ఫైర్ చేస్తున్న ఎస్పీ
మాధవ్ రెడ్డి


