మహాత్మాగాంధీ కేన్సర్ హాస్పిటల్లో.. అత్యాధునిక టోమోథెర
విశాఖపట్నం: కేన్సర్ చికిత్సలో రాష్ట్రంలో తొలిసారి అత్యాధునిక టోమోథెరపీ వైద్యసేవలను విశాఖపట్నంలోని ఎంవీపీ కాలనీలో మహాత్మాగాంధీ కేన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ అందుబాటులోకి తెచ్చింది. మంగళవారం హాస్పిటల్లో జరిగిన కార్యక్రమంలో విశాఖ ఎంపీ శ్రీభరత్, హాస్పిటల్ ఎం.డి డాక్టర్ వున్నా మురళీకృష్ణతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ కేన్సర్ రోగులకు ఉపశమనం కలిగించే విధంగా మహాత్మాగాంధీ కేన్సర్ హాస్పిటల్ ఏపీలో తొలిసారి అత్యాధునిక టోమోథెరపీ సాంకేతికతను అందుబాటులోకి తేవడం హర్షణీయమన్నారు. దీని ద్వారా మెరుగైన వైద్యసేవలు కేన్సర్ రోగులకు అందించడం సాధ్యమవుతుందన్నారు. హాస్పిటల్ ఎం.డి మురళీకృష్ణ మాట్లాడుతూ రూ.32 కోట్లు విలువైన ఈ యూనిట్ కొనుగోలుతో మహాత్మాగాంధీ కేన్సర్ హాస్పిటల్ దేశంలో లెవెల్ 3 కేటగిరి హాస్పిటల్స్గా గుర్తింపు తెచ్చుకుందన్నారు. ఈ సాంకేతికత ద్వారా కేన్సర్ ట్యూమర్ను అత్యంత కచ్చితత్వంతో గుర్తించి నిమిషాల వ్యవధిలో చికిత్స అందించవచ్చన్నారు. కార్యక్రమంలో పలువురు హాస్పిటల్ వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.


