
వరుస తుఫాన్లతో.. మత్య్సకారులు విలవిల
● వేటసాగితేనే పూటగడిచే పరిస్థితి
● విపత్తులతో సాగని వేట
● ఆర్థిక ఇబ్బందుల్లో 5వేల కుటుంబాలు
● ప్రభుత్వం ఆదుకోవాలని వినతి
భోగాపురం: మత్స్యకారుల్లో వరుసగా ఏర్పడుతున్న తుఫాన్లు అలజడి సృష్టిస్తున్నాయి. సంద్రం అల్లకల్లోలంగా మారడంతో వేట సాగడం లేదు. కుటుంబాలను సాకేందుకు ఇబ్బందులు పడుతున్నారు. కడలిని నమ్మకుని బతుకుతున్న మత్స్యకారులు పస్తులతో గడపాల్సిన పరిస్థితులు నెలకున్నాయి. విజయనగరం జిల్లాలోని నెల్లిమర్ల నియోజకర్గంలో పూసపాటిరేగ, భోగాపురంలో 14 సముద్రతీర గ్రామాలున్నాయి. ఈ గ్రామాల్లో 15,138 మంది మత్య్సకార కుటుంబాలు ఉన్నాయి. వారిలో సుమారు 4 వేల నుంచి 5 వేల మందికిపైగా మత్య్సకారులు సముద్రంలో 712 మోటారు బోట్లు, 417 సంప్రదాయ పడవల్లో వేట కొనసాగిస్తూ కుటుంబాలను నెట్టుకొస్తున్నారు. వరుసగా ఏర్పడిన తుఫాన్లతో వేట సాగడం లేదు. వలలు, బోట్లు భద్రపరిచేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. సాహసించి సంద్రంలోకి వెళ్లినా వేట కలిసిరావడంలేదని, తీరానికి చేరుకునేవరకు భయంభయంతో గడపాల్సి వస్తోందని మత్స్యకారులు వాపోతున్నారు. ప్రభుత్వం ఆదుకో వాలని, ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరుతున్నారు.
వేటకు వెళ్లొద్దు
పూసపాటిరేగ: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నందున భోగాపురం, పూసపాటిరేగ మండలాల్లోని తీర గ్రామాల మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని విజయనగరం మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎం.విజయకృష్ణ కోరారు. మత్స్యశాఖ నుంచి తదుపరి ఆదేశాలు వచ్చే వరకు చేపల వేటకు వెళ్లవద్దని సూచించారు. చింతపల్లి, పతివాడబర్రిపేట, తమ్మయ్యపాలెం, తిప్పలవలస, కోనాడ, ముక్కాం, చేపలు కంచేరు గ్రామాల్లో మత్స్యశాఖ అధికారులు పర్యటించి అప్రమత్తంచేశామన్నారు.
ముక్కాంలో పర్యటించిన ఎంపీడీఓ
భోగాపురం మండలంలోని తీర గ్రామం ముక్కాంలో ఎంపీడీఓ గాయత్రి మంగళవారం పర్యటించారు. సముద్ర తీరం ఒడ్డున ఉన్న వలలు, పడవలను సురక్షిత ప్రదేశాలకు తరలించే ఏర్పాట్లు చేశారు. ప్రజలను అప్రమత్తం చేశారు. ఆమె వెంట పంచాయతీ కార్యదర్శితో పాటు సచివాలయ సిబ్బంది ఉన్నారు.
ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం
వరుస తుఫాన్లతో కొన్ని రోజులుగా వేట సాగక మత్య్సకారులు ఇబ్బందులు పడుతుండడం వాస్తవమే. ఈ మధ్య కాలంలో కొన్ని రోజులుగా వాతావరణంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తరచూ భారీ వర్షాలు కురుస్తుడడంతో మత్య్సకారులు వేటను నిలిపివేసి ఖాళీగా ఉంటున్నారు. మత్య్సకారులు పడుతున్న ఇబ్బందులను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి వారిని ఆదుకునే చర్యలు తీసుకుంటాం.
– ఎఫ్డీఓ జె శ్రీనివాసరావు
పస్తులతో జీవనం
కొన్నిరోజులుగా సముద్రంలో వేట సక్రమంగా సాగడం లేదు. తరచూ తుఫాన్లు ఏర్పడడంతో సముద్రం అల్లకల్లోలంగా మారుతోంది. ఏ రోజుకారోజు వేట సాగించి జీవిస్తుంటాం. ఈ క్రమంలో రోజులతరబడి వేట సాగకపోవడంతో జీవనం కష్టతరంగా మారుతోంది. పస్తులతో కాలం వెళ్లదీయాల్సి వస్తోంది. – వాసుపల్లి అమ్మోరు,
మత్య్సకారుడు, చేపలకంచేరు గ్రామం
ప్రభుత్వం ఆదుకోవాలి
ప్రస్తుతం సముద్రంలో వేట సాగించేందుకు వాతావరణం అనుకూలంగా లేదు. అందుకే తప్పనిసరి పరిస్థితిల్లో వేటకు విరామం చెప్పక తప్పలేదు. వరుస తుఫాన్లతో కొన్ని రోజుల నుంచి మరింతగా ఇబ్బందులు కలిగిస్తున్నాయి. వేట సాగని కాలంలో ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలి.
– మైలపల్లి మహేష్, మత్య్సకారుడు,
ముక్కాం గ్రామం

వరుస తుఫాన్లతో.. మత్య్సకారులు విలవిల

వరుస తుఫాన్లతో.. మత్య్సకారులు విలవిల

వరుస తుఫాన్లతో.. మత్య్సకారులు విలవిల

వరుస తుఫాన్లతో.. మత్య్సకారులు విలవిల

వరుస తుఫాన్లతో.. మత్య్సకారులు విలవిల

వరుస తుఫాన్లతో.. మత్య్సకారులు విలవిల