
ఉద్యోగోన్నతి తర్వాతే డీఎస్సీ నియామకాలు చేపట్టాలి
విజయనగరం అర్బన్: ఉపాధ్యాయుల ఉద్యోగోన్నతి కోటాను భర్తీ చేసిన తర్వాతే మెగా డీఎస్సీ నియామకాలు చేపట్టాలని రాష్ట్రీయ ఉపాధ్యాయ సంఘం జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. కమిటీ సభ్యులు శుక్రవారం డీఈఓ యు.మాణిక్యంనాయుడును కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. ఉద్యోగోన్నతి కల్పించకుండా డీఎస్సీ నియామకాలు చేపడితే ఉపాధ్యాయులకు అన్యాయం జరుగుతుందన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పాడైన పాఠశాలల భవనాలను బాగుచేయాలని విన్నవించారు. డీఈఓను కలిసిన వారిలో సంఘ నాయకులు కె.జోగారావు, సీహెచ్ సూరిబాబు, ఎస్.చిట్టిబాబు, పి.లక్ష్మణరావు, బి.అడివయ్య, వాసుదేవరావు, వి.మల్లేశ్వరరావు, రవి తదితరులు ఉన్నారు.
అత్యాధునిక నైపుణ్య శిక్షణ
● ఎస్ఎస్ఐపీఎల్తో నాక్ ఎంఓయూ
● అసిస్టెంట్ డైరెక్టర్ సుధాకర్
విజయనగరం అర్బన్: జిల్లాలో త్వరలో అత్యాధునిక నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను ప్రారంభిస్తామని నేషనల్ అకాడమీ ఆఫ్ కనస్ట్రక్షన్ (నాక్) జిల్లా సహాయ సంచాలకుడు ఎం.సుధాకర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. నిర్మాణ రంగంలోని స్వింగ్ స్టేటర్ ప్రైవేట్ లిమిటెడ్తో ఇటీవలే నాక్ ఎంఓయూ కుదుర్చుకుందన్నారు. దీని ప్రకారం తరగతి గదుల్లో సిద్ధాంతపరమైన బోధనతో పాటు ప్రాజెక్టు సైట్లో ప్రాక్టికల్ శిక్షణ, అభ్యర్థులకు అధునాతన పరికరాలు, భద్రతా కిట్లు, రవాణా సౌకర్యం లభిస్తాయన్నారు. స్థానిక శిక్షకులను టీఓటీలుగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. యువతను సర్టిఫైడ్ మిషన్ ఆపరేటర్లు, సాంకేతిక నిపుణులుగా తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు.
స్కానింగ్ సెంటర్లను తనిఖీ చేయాలి
● కలెక్టర్ డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్
విజయనగరం ఫోర్ట్: జిల్లాలోని స్కానింగ్ సెంటర్లను తనిఖీచేసి నివేదికను అందజేయాలని కలెక్టర్ డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ అన్నారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో సీపీపీఎన్డీటీ చట్టం అమలుపై శుక్రవారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. నెలవారీగా జరుగుతున్న స్కానింగ్ వివరాలు, ప్రసవాలు, అనధికారికంగా ఆస్పత్రుల్లో జరుగుతున్న గర్భస్రావాలపై ప్రశ్నించారు. గర్భస్థ లింగ నిర్ధారణ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు. ప్రతి స్కానింగ్ సెంటర్లో తప్పనిసరిగా ధరల పట్టికను, లింగనిర్ధారణ చేయడం నేరమని తెలిపే బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. సరోగసి కేంద్రాలకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి అని స్పష్టం చేశారు. జిల్లా స్కానింగ్ సెంటర్లను తనిఖీ చేసేందుకు డివిజన్ల వారీగా ఆర్డీఓ, డీఎస్పీ, డిప్యూటీ డీఎంహెచ్ఓలతో కమిటీని వేస్తున్నట్టు తెలిపారు. సమావేశంలో డీఎంహెచ్ఓ డాక్టర్ ఎస్.జీవనరాణి, డీసీహెచ్ఎస్ పద్మశ్రీరాణి, అడిషనల్ డీఎంహెచ్ఓ కె.రాణి, డిప్యూటీ డీఎంహెచ్ఓ ఎన్. సూర్యనారాయణ, డీఐఓ అచ్చుతకుమారి, డీపీఎంఓ రవికుమార్రెడ్డి, డీఎస్పీ గోవిందరావు, ఆర్డీఓ దాట్ల కీర్తి, తదితరులు పాల్గొన్నారు.
బాధ్యతల స్వీకరణ
సీతంపేట: ఐటీడీఏ ఇన్చార్జి ప్రాజెక్టు అధికారిగా పాలకొండ సబ్ కలెక్టర్ పవర్ స్వప్నిల్ జగన్నాథ్ శుక్రవారం పూర్తి అదనపు బాధ్యతలు చేపట్టారు. ఆయనకు ఐటీడీఏలోని వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధిని సమీక్షిస్తానని, క్షేత్రస్థాయిలో పర్యటించి అభివృద్ధి చేయాల్సిన వివరాలు తెలియజేస్తానన్నారు.

ఉద్యోగోన్నతి తర్వాతే డీఎస్సీ నియామకాలు చేపట్టాలి

ఉద్యోగోన్నతి తర్వాతే డీఎస్సీ నియామకాలు చేపట్టాలి