మహా విశాఖ నగరంలోని వివిధ ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి తీవ్రరూపం దాల్చి ప్రజలు అల్లాడిపోతున్నారు. ఆరిలోవ పరిధిలోని 9 నుంచి 13 వార్డులు, విశాలాక్షినగర్, రవీంద్రనగర్ సహా పలు కాలనీల్లో ముడసర్లోవ రిజర్వాయర్ ఎండడం, బోర్లు ఎండిపోవడంతో మూడు రోజులకోసారి వచ్చే కుళాయిల కోసం బిందెలతో ఎదురుచూస్తూ బయట కేన్లు కొనుక్కుంటున్నారు. మధురవాడ, పీఎం పాలెం, ఎంవీవీ సిటీ ప్రాంతాల్లో భూగర్భజలాలు పడిపోయి గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్మెంట్ల వాసులు జీవీఎంసీ ట్యాంకర్లకు డబ్బు చెల్లించినా సకాలంలో అందక ప్రైవేట్ ట్యాంకర్లపై అదనపు భారం మోస్తున్నారు. అక్కయ్యపాలెంలోని చిన్నూరు, కాళ్లవారితోటల్లో బోర్లు పనిచేయక కుళాయిలపై ఆధారపడితే తెల్లవారుజామున వచ్చే కొద్దిపాటి నీటిలోనూ బురద వస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక దక్షిణ నియోజకవర్గ పరిధిలోని సాలిపేట, పూర్ణామార్కెట్, కల్లుపాకలు, రెల్లివీధి వంటి మురికివాడల్లో టౌన్ సర్వే రిజర్వాయర్ సరఫరా సమయం తగ్గించడంతో తీవ్ర నీటి కొరత ఏర్పడిందని, పనిచేయని వీధి బోర్లకు వెంటనే మరమ్మతులు చేసి ఆదుకోవాలని నగరవాసులు కోరుతున్నారు.


