సింహాచలం: సింహగిరిపై శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి క్షేత్రంలో శుక్రవారం జరిగిన ఉచిత సామూహిక వరలక్ష్మీవ్రతాలకు మహిళలు పోటెత్తారు. మొత్తం మూడు వేదికలపై నాలుగు బ్యాచ్ల్లో జరిగిన వ్రతాల్లో 6,150 మంది మహిళలు పాల్గొని, భక్తి శ్రద్ధలతో ఆచరించారు. లక్ష్మీదేవి నామస్మరణలో మునిగితేలారు. సింహగిరిపై ఆలయ ఉత్తర రాజగోపురం ఎదురుగా ఉన్న వార్షిక కల్యాణోత్సవ ప్రాంగణం, కొత్తగా నిర్మించిన క్యూకాంప్లెక్స్, పీఏసీ బిల్డింగ్లో నాలుగు వేదికలు ఏర్పాటు చేసి లక్ష్మీదేవి విగ్రహాలను వేంజేపచేశారు. ఉదయం 7.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నాలుగు బ్యాచ్ల్లో వరలక్ష్మీవ్రతాలు నిర్వహించారు. విష్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, మండపారాధన, కలశారాధన, అష్టోత్తర శత కుంకుమ పూజలు ఘనంగా జరిపారు. మహిళల చేత లక్ష్మీదేవి అష్టోత్తర శతనామాలను పఠింపజేస్తూ అర్చకులు వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరింపజేశారు. అనంతరం శ్రావణ మంగళ గౌరీదేవి వ్రత కథ వివరించారు. పూజలో పాల్గొన్న మహిళలకు దేవస్థానం ఉచితంగా పసుపు కుంకుమలు, మట్టి కలశం, గాజులు, రవికెలు, స్వామివా రి రాగి మాడ, కొబ్బరికాయలు, ప్రసాదం అందజేసింది. కొండ దిగువ నుంచి సింహగిరిపైకి, సింహగిరి నుంచి కొండదిగువకు దేవస్థానం బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించారు. ఉచితంగా స్వామివారి దర్శనాన్ని, అన్నప్రసాద భవనంలో భోజనాన్ని అందజేశా రు. దేవస్థానం ప్రధానార్చకుడు గొడవర్తి శ్రీనివాసా చార్యులు, కరి సీతారామాచార్యుల పర్యవేక్షణలో అర్చకులు, వేద పడింతులు, వేద పాఠశాల విద్యార్థులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టర్ అభిషిక్త్ కిశోర్ సతీమణితోపాటు, దేవస్థానం ట్రస్ట్బోర్డు సభ్యులు కరక దేముడు, ఉషశ్రీ, మధుపాడ సన్యాసిరావు పాల్గొన్నారు. దేవస్థానం ఈవో వెంకటరావు ఆధ్వర్యంలో అధికారులు ఏర్పాట్లు పర్యవేక్షించారు.


