సాక్షి, విశాఖపట్నం : బంగాళాఖాతంలో దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీర ప్రాంతాలపై ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఉదయం నుంచే ఆకాశం దట్టంగా మేఘావృతమై.. నగరమంతటా ఎడతెరిపి లేకుండా ముసురులా వర్షం కురిసింది. భానుడి భగభగలతో విలవిల్లాడిన సాగరతీర నగరాన్ని చిరుజల్లులు పలకరించడంతో ప్రకృతి ఒక్కసారిగా పులకరించింది. బుధవారం అర్ధరాత్రి నుంచే మొదలైన వాన గురువారం ఉదయం వరకు కొనసాగింది. దీంతో విధులకు, పాఠశాలలకు వెళ్లే వారు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. లోతట్టు ప్రాంతాల్లోని రహదారులపైకి స్వల్పంగా నీరు చేరడంతో అక్కడక్కడ వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో ట్రాఫిక్ నెమ్మదించింది. అల్పపీడనం ప్రభావంతో రానున్న మరికొన్ని గంటల్లో నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఒకటి రెండు చోట్ల భారీ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.


