నగరంలో కమ్ముకుంటున్న కాలుష్య మేఘాలు ‘స్వచ్ఛ వాయు సర్వేక్షణ్’లో 21వ స్థానానికి పడిపోయిన నగరం ప్రతి 10 రోజుల్లో 7 రోజులు విషవాయువులే పీలుస్తున్న విశాఖవాసులు కాలుష్య నియంత్రణను గాలికొదిలేసిన ప్రభుత్వం వాతావరణ మార్పులే కారణమంటూ వింతవాదనలు
సాక్షి, విశాఖపట్నం: ఒకవైపు సాగర తీరపు ప్రకృతి అందాలు.. మరోవైపు ఉక్కిరిబిక్కిరి చేసే పారిశ్రామిక ఉద్గారాలు! పచ్చదనానికీ, కాలుష్యానికీ మధ్య ఏళ్లుగా నడుస్తున్న పోరాటంలో విశాఖపట్నం మెల్లమెల్లగా విషవాయువుల వలయంలోకి జారుకుంటోంది. నగరంలో రోజురోజుకూ దిగజారుతున్న గాలి నాణ్యతే దీనికి ప్రత్యక్ష నిదర్శనం. కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన ‘స్వచ్ఛ వాయు సర్వేక్షణ్–2026’ నివేదికలో విశాఖపట్నం 172 పాయింట్లతో ఏకంగా 21వ స్థానానికి దిగజారిపోవడం స్థానికులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. అభివృద్ధి, సంపద సృష్టి జపంతో అధికారంలోకి వచ్చిన ప్రస్తుత ప్రభుత్వం.. ప్రజల ప్రాణవాయువును కాపాడటంలో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పరిశ్రమలు నిబంధనలు ఉల్లంఘిస్తున్నా కాలుష్య నియంత్రణ మండలి అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండటంతో విశాఖవాసుల ఆరోగ్యానికి గ్యారెంటీ కరువైంది.
ప్రమాద ఘంటికలు మోగిస్తున్న ’పీఎం’ లెవెల్స్
నగరంలో గాలి నాణ్యతను సూచించే సూక్ష్మ ధూళి కణాలు ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. సాధారణంగా గాలిలో పీఎం–10 కణాలు 60 మైక్రోగ్రాములు/క్యూబిక్ మీటర్, పీఎం–2.5 కణాలు 40 మైక్రోగ్రాములు/క్యూబిక్ మీటర్ లోపు ఉండాలి. కానీ, విశాఖలోని పారిశ్రామిక ప్రాంతాలు, పోర్టు పరిసరాలు, కంచరపాలెం, జ్ఞానాపురం, గాజువాక వంటి ప్రాంతాల్లో ఇవి నిత్యం 100 నుంచి 150 మార్కును దాటుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పీఎం–10 సగటు 84 ఉంటే, ఒక్క విశాఖలోనే అది 140 దాటుతుండటం గమనార్హం. అలాగే, నైట్రోజన్ డయాకై ్సడ్ రాష్ట్ర సగటు 23 మైక్రోగ్రాములు/క్యూబిక్ మీటర్లు ఉండగా, విశాఖలో అత్యధికంగా 47.41గా నమోదైంది. అత్యంత ప్రమాదకరమైన పీఎం–2.5 కణాలు గాలిలో విపరీతంగా కలిసిపోతుండటంతో నగర ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ తరచూ ‘పూర్’ కేటగిరీలోనే కనిపిస్తోంది.
కాలుష్యానికి ప్రధాన కారణాలు
బొగ్గు, ముడిసరుకుల రవాణా : విశాఖ పోర్టు నుంచి బొగ్గు, ఐరన్ ఓర్ వంటి ముడిసరుకులను రవాణా చేయడం వల్ల విపరీతంగా ధూళి రేగుతోంది.
పారిశ్రామిక ఉద్గారాలు : ఫార్మాసిటీ, పరవాడ, స్టీల్ప్లాంట్ వంటి భారీ పరిశ్రమల నుంచి నిరంతరం విషవాయువులు, రసాయన ఉద్గారాలు గాలిలో చేరుతున్నాయి.
వాహనాల రద్దీ ..రోడ్డు దుమ్ము: నగరంలో వాహనాల సంఖ్య విపరీతంగా పెరగడం, రోడ్లపై పేరుకుపోతున్న దుమ్మును తొలగించకపోవడం మరో ప్రధాన కారణం.
గతంలో ఈ దుమ్మును అరికట్టేందుకు క్రమం తప్పకుండా రోడ్లపై నీళ్లు చల్లడం, యాంటీ స్మాగ్ గన్స్ ఉపయోగించడం వంటి చర్యలు చేపట్టేవారు. ప్రస్తుతం అటువంటి చర్యలేవీ నగరంలో కనిపించడం లేదు.


