మహారాణిపేట: పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి పిలుపునిచ్చారు. వినాయక చవితి సందర్భంగా పర్యావరణానికి హాని కలిగించే రసాయన రంగులు, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలకు బదులుగా సహజసిద్ధమైన మట్టి ప్రతిమలను వినియోగించాలని సూచించారు. కలెక్టరేట్లోని ఉద్యోగులకు గురువారం ఆమె మట్టి వినాయక ప్రతిమలు పంపిణీ చేసి మాట్లాడారు. ప్రతి ఒక్కరూ పర్యావరణ హిత వినాయక ప్రతిమలను వినియోగించి.. ఆదర్శంగా నిలవాలని కోరారు. అనంతరం మట్టి గణపతి ప్రతిమల పోస్టర్ను జేసీ ఆవిష్కరించారు. పీసీబీ ఆధ్వర్యంలో మట్టి వినాయక ప్రతిమలు సమకూర్చారు. కార్యక్రమంలో పీసీబీ ఈఈ ముకుందరావు, కలెక్టరేట్ ఏవో బీవీ రాణి, వివిధ సెక్షన్ల సూపరింటెండెంట్లు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


