సింహగిరి రాజగోపురం వద్ద సందడిగా వేడుక
మురళీధరుని లీలలను తలపిస్తూ సింహగిరిపై సాగిన ఉట్ల సంబరం భక్తులకు అమితానందాన్ని పంచింది. రంగురంగుల నీటిధారలను తట్టుకుంటూ ఎత్తులో ఉన్న ఉట్టిని కొట్టేందుకు చేసిన సాహసాలు తిలకించిన వారిలోనూ ఉత్సాహాన్ని నింపాయి. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా సింహగిరి దివ్యక్షేత్రంలో రాజగోపురం ముంగిట భక్తజన సందోహం నడుమ శనివారం సాయంత్రం సాగిన ఉట్ల సంబరం అందరినీ ఆకట్టుకుంది. ముందుగా స్వామివారి ఉత్సవ మూర్తి గోవిందరాజస్వామిని శ్రీకృష్ణుడిగా అలంకరించి, శ్రీదేవి, భూదేవితో సహా పల్లకిలో కొలువుదీర్చారు. రాజగోపురం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఉట్టిని యాదవుడు నమ్మి శివప్రసాద్ అందుకునేందుకు ప్రయత్నించగా ఆలయ ప్రధానార్చకుడు కరి సీతారామాచార్యులు తాడు లాగారు. పెద్ద ఎత్తున భక్తులు ఉత్సవాన్ని తిలకించారు. భక్తులకు వెన్న ప్రసాదాన్ని అందజేశారు. అనంతరం సింహగిరి మాడ వీధుల్లో తిరువీధి నిర్వహించారు. దేవస్థానం ఈవో జల్లేపల్లి వెంకటరావు పాల్గొన్నారు.
అలరించిన చిన్ని కృష్ణులు
చిన్నారులు చిన్నికృష్ణుడిగా అలరించారు. కృష్ణాష్టమిని పురస్కరించుకుని పదేళ్లలోపు చిన్నారులకు సింహగిరిపై నిర్వహించిన శ్రీకృష్ణవేషధారణ పోటీల్లో పలువురు చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కోలాటం ఆకట్టుకుంది.
–సింహాచలం


