గోపాలపట్నం: జీవీఎంసీ 92వ వార్డు మేహాద్రి గెడ్డ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలను తొలగించి, ఏర్పాటు చేసిన సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ను పశ్చిమ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గణబాబు మంగళవారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ఈ కేంద్రంలో ఆకాశ్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో జేఈఈ, నీట్లో ఉచిత శిక్షణ ఇస్తారని తెలిపారు. ఏటా ప్రతీ విద్యార్థికి సుమారు రూ.65వేలు ఖర్చయ్యే కోర్సు ఇక్కడ పేద విద్యార్థులకు ఉచితంగా లభ్యమవుతుందని తెలియజేశారు. 600మంది విద్యార్థులతో ఎక్స్లెన్స్ సెంటర్లు ప్రారంభిస్తున్నామని, ఇందులో 75శాతం సీట్లు ఎస్సీ విద్యార్థులకు, 25శాతం ఇతర విద్యార్థులకు కేటాయిస్తారని తెలిపారు. ప్రతీ కేంద్రంలో 22 మంది సిబ్బంది ఉంటారన్నారు. ఇందులో 18మంది బోధకులు, ఒక మానిటర్, ఒక కౌన్సెలర్, ఇద్దరు టెక్నికల్ సిబ్బంది ఉంటారని తెలియజేశారు. కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి ఎంఎం నాయక్, సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీ కార్యదర్శి డాక్టర్ ఎన్.మోహనరావు, డీసీవో రామకృష్ణ, పాఠశాల ప్రిన్సిపాల్ ప్రియదర్శిని, ఆకాశ్ ఇనిస్టిట్యూట్ సౌత్ జోన్ అకడమిక్ హెడ్ ధీరజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.


