మహారాణిపేట: ‘ప్రజల కోసం సంపద సృష్టిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం.. కొంతమంది వ్యక్తులు, కార్పొరేట్ సంస్థల ప్రయోజనాల కోసం విశాఖ సహజ సంపదను దోచుకుంటోంది’ అని వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి బి.ఎస్.కృష్ణ (ఆల్ఫా కృష్ణ) ఆరోపించారు. మద్దిలపాలెంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి విశాఖ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో కొండలు, మట్టి తదితర సహజ వనరుల తరలింపు జరుగుతున్నా.. సంబంధిత శాఖల అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ప్రజా సంక్షేమంపై కాకుండా జిల్లాలోని సహజ వనరులను కొల్లగొట్టడంపైనే కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు. అధికార పార్టీ నాయకుల ప్రయోజనాలకు అనుగుణంగా ప్రభుత్వ యంత్రాంగం వ్యవహరిస్తోందని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు విద్యనందిస్తున్న గురుకుల పాఠశాలను కొనసాగించాలని, ఉన్నట్టుండి ఈ పాఠశాలను ఎందుకు తరలించాల్సి వచ్చిందో ప్రభుత్వం స్పష్టమైన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ప్రజలకు సరిపడా తాగునీరు అందించాలి
గ్రేటర్ విశాఖలో లక్షలాది మంది ప్రజలు తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారని బి.ఎస్.కృష్ణ తెలిపారు. ప్రజలకు సరిపడా స్వచ్ఛమైన తాగునీరు అందించాలని, విశాఖలో తాగునీటి సమస్యపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని, పెరిగిన ధరలను నియంత్రించాలని డిమాండ్ చేశారు. జిల్లాలోని ప్రైవేట్ స్కూళ్లు, కళాశాలల్లో విద్యార్థుల భద్రత, సౌకర్యాలపై ప్రభుత్వం కఠినమైన పర్యవేక్షణ చేయాల్సిన అవసరముందన్నారు.


