మహారాణిపేట: ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న డిమాండ్ల సాధన కోసం ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పెన్షనర్స్ అసోసియేషన్(ఏపీఆర్పీఏ) రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కలెక్టరేట్ వద్ద విశ్రాంత ఉద్యోగులు బుధవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పెన్షనర్ల సంఘం ప్రధాన కార్యదర్శి ఎస్.కె.హుస్సేన్ మాట్లాడుతూ సుప్రీం కోర్టు తీర్పు మేరకు ఎన్నో ఏళ్ల నుంచి కనీస పెన్షన్ రూ.9 వేలు, డీఏ, హయ్యర్ పెన్షన్ అమలు చేయాలని ఆందోళనలు చేస్తున్నా.. ప్రభుత్వం పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర కార్యదర్శి కె.సుధాకర్రావు మాట్లాడుతూ కార్మికులకు కనీస సౌకర్యాలు లేకుండా చేస్తున్నారని, కరోనా పేరు చెప్పి రైల్వేలో గతంలో ఉన్న రాయితీ కూడా తొలగించారని ఆక్షేపించారు. అసోసియేషన్ అధ్యక్షుడు కె.దీనబంధు మాట్లాడుతూ దేశంలో కోట్లాది పెన్షనర్లకు నష్టం కలిగించే పెన్షన్ రీవాల్యుయేషన్ బిల్లు–2025ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 8వ పీఆర్సీ నివేదికను త్వరగా రప్పించి, ఈ ఏడాది నుంచి అమలు చేయాలన్నారు. ధర్నా అనంతరం డీఆర్వో విశ్వేశ్వరనాయుడుకు తమ సమస్యలపై వినతిపత్రం అందించారు. ధర్నాలో సంఘం నాయకులు రమణారెడ్డి, పి.గుర్రప్ప, ఎస్.జగన్నాథరావు, త్రినాథ్, కె.అప్పలరాజు తదితరులు ఉన్నారు.


