మహారాణిపేట: యుద్ధ ప్రాంతాల్లో అమాయక నావికుల హత్యలను ఖండిస్తూ మర్చంట్ నేవీ ఆఫీసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (ఎంఎన్వోడబ్ల్యూఏ), విశాఖపట్నం ఆధ్వర్యంలో ఆదివారం మౌన నిరసన నిర్వహించారు. కాళీమాత ఆలయం నుంచి వైఎంసీఏ, బీచ్ రోడ్ వరకు చేపట్టిన ఈ నిరసనలో సుమారు 40 మంది నావికులు పాల్గొని యుద్ధాల్లో ప్రాణాలు కోల్పోయిన నావికులు, వారి కుటుంబాలకు సంఘీభావం తెలిపారు. మర్చంట్ నావికులు పౌరులేనని, కుటుంబాలకు దూరంగా సముద్రంలో విధులు నిర్వర్తిస్తూ ప్రతికూల వాతావరణం, సముద్ర దొంగల ముప్పును ఎదుర్కొంటూ వివిధ ప్రాంతాలకు సరకు రవాణా చేస్తుంటారని అసోసియేషన్ ప్రతినిధులు పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ఓడ యజమానులు, ఏజెన్సీలు న్యాయమైన, సకాలంలో నష్టపరిహారంతో పాటు తగిన సహాయం అందించాలని డిమాండ్ చేశారు. అసోసియేషన్ అధ్యక్షుడు కెప్టెన్ కాళీ ప్రసాద్ ఆధ్వర్యంలో వీఆర్ సాగి, ప్రసన్నకుమార్, కెప్టెన్ వాసుదేవరావు, కెప్టెన్ మహాపాత్ర, కె.కె.చంద్, బగాడి లక్ష్మణరావు, కెప్టెన్ తివారీ, కెప్టెన్ సరోజ్ మిశ్రా, కెప్టెన్ పక్కి ప్రసాద్, రమణ, శ్రీనివాస్, కెప్టెన్ కుప్పం ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.


