జిల్లా ఇన్చార్జి మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి
మహారాణిపేట: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆగస్టు 1న భోగాపురంలో చేపట్టనున్న పర్యటనతో పాటు అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని జిల్లా ఇన్చార్జి మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అధికారులను ఆదేశించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తూ ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా రవాణా, ట్రాఫిక్, తాగునీరు, వైద్య సేవలు, భద్రత తదితర అంశాల్లో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సూచించారు. బుధవారం కలెక్టరేట్లో జరిగిన సమీక్షా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల ఆకాంక్ష అయిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం ఈ ప్రాంత అభివృద్ధిలో చారిత్రాత్మక ఘట్టమని అన్నారు. కార్యక్రమానికి స్వచ్ఛందంగా హాజరయ్యే ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ప్రారంభోత్సవానికి వచ్చే ప్రజల కోసం ప్రత్యేక రవాణా ప్రణాళిక రూపొందించాలని, జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి బయలుదేరే బస్సులు ఉదయం 9 గంటలలోపు భోగాపురం చేరుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. బస్సుల రూట్లు, సమయాలను ప్రత్యేక యాప్ ద్వారా పర్యవేక్షించడంతో పాటు సాధారణ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ట్రాఫిక్ ప్రణాళిక అమలు చేయాలని చెప్పారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి రావడం వల్ల ఉత్తరాంధ్రలో ఉపాధి, పెట్టుబడులు, పర్యాటకం, వ్యాపారం, విమానయాన రంగాలకు కొత్త అవకాశాలు లభిస్తాయని మంత్రి పేర్కొన్నారు. సమావేశంలో కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్, పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, జాయింట్ కలెక్టర్ విద్యాధరి, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు, ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, పి.విష్ణుకుమార్రాజు, కార్పొరేషన్ చైర్మన్లు సీతంరాజు సుధాకర్, గండి బాబ్జి తదితరులు పాల్గొన్నారు.


