మహారాణిపేట: పాత్రికేయ, సామాజిక సేవా రంగాల్లో విశేష కృషి చేస్తున్న సీనియర్ పాత్రికేయుడు గంట్ల శ్రీనుబాబు రాష్ట్ర ప్రభుత్వ ఉగాది పురస్కారాన్ని అందుకున్నారు. గురువారం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ఆయన ఈ పురస్కారాన్ని స్వీకరించారు. ముఖ్యమంత్రి ఆయన్ని శాలువాతో సత్కరించి, తెలుగు తల్లి జ్ఞాపిక, రూ.10 వేల నగదు పురస్కారం, ప్రశంసా పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనుబాబును తోటి పాత్రికేయులు, మిత్రులు అభినందనలు తెలిపారు. కాగా.. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ నాయకుడిగా, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శిగా ఆయన బాధ్యతలు నిర్వహిస్తున్నారు.


