పాయకరావుపేట: పట్టణంలో గురువారం ఘనంగా పేరంటాలమ్మ తీర్థం ఘనంగా జరిగింది. ఉగాది పురస్కరించుకుని గురువారం మంగవరం రోడ్డులో గల సీతారామ ఆలయానికి పక్కన గల పేరంటాలమ్మ గుడిని భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకున్నారు. పేరంటాలమ్మకు పసుపు, కుంకుమ, కొబ్బరికాయలు, అరటిపండ్లు, గాజులు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు అవసరమైన ఏర్పాట్లు మలిపెద్ది కుటుంబీకులు చేశారు. చిలకల తీర్థంగా పిలుచుకునే ఈ పండగ సందర్భంగా రంగు రంగులతో తయారు చేసిన పంచదార చిలకలు, ఆట వస్తువులు, దేవుని బొమ్మలు, చిన్న పిల్లల బొమ్మలను విక్రయించారు. రంగు రంగుల చేటలు, బెల్లంతో తయారు చేసిన చిన్న సైజు మిఠాయి పొట్లాలను భక్తులు ఆసక్తిగా కొనుగోలు చేశారు. అదేవిధంగా సీతారామ ఆలయాన్ని కూడా భక్తులు సందర్శించి సీతారాములను భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. వానరసేన సభ్యులు భక్తులకు తీర్థ ప్రసాదాలను అందించారు. సీఐ జి.అప్పన్న ఆధ్వర్యంలో పోలీసులు తీర్థంలో ఏవిధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు నిర్వహించారు.


