గంజాయి రవాణా కేసులో మరో ముగ్గురి అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

గంజాయి రవాణా కేసులో మరో ముగ్గురి అరెస్ట్‌

Aug 22 2025 6:51 AM | Updated on Aug 22 2025 6:51 AM

గంజాయి రవాణా కేసులో మరో ముగ్గురి అరెస్ట్‌

గంజాయి రవాణా కేసులో మరో ముగ్గురి అరెస్ట్‌

మర్రిపాలెం: ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదం కేసులో ఊహించని మలుపు చోటు చేసుకుంది. ప్రమాదానికి కారణమైన కారులో గంజాయిని గుర్తించిన పోలీసులు, ఆ కేసులో పరారీలో ఉన్న మరో ముగ్గురిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ విషయాన్ని గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఐదో పట్టణ పోలీస్‌ స్టేషన్‌ సీఐ రవికుమార్‌ వెల్లడించారు. ఈ నెల 12న సుభాష్‌నగర్‌ వద్ద జరిగిన ప్రమాదంలో ఒక కారు ఢీకొని ఏడాదిన్నర చిన్నారి వర్షిత్‌ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటన తర్వాత కారు డ్రైవర్‌, తమిళనాడుకు చెందిన అర్జునన్‌ జెమినీ అధ్ముఘంను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ప్రమాదం జరిగినప్పుడు కారులో ఉన్న మరో ముగ్గురు పరారయ్యారు. పోలీసులు ఈ నెల 16న సీజ్‌ చేసిన కారును తనిఖీ చేయగా.. అందులో 21 కిలోల గంజాయిని గుర్తించారు. విచారణలో భాగంగా పరారీలో ఉన్న ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారిలో హైదరాబాద్‌లోని హాస్టల్‌లో ఉంటున్న గుంటూరుకు చెందిన 20 ఏళ్ల అక్షయ గౌతమి, ఒంగోలుకు చెందిన 25 ఏళ్ల పెర్లి విజయవర్ధన్‌ రాజు, గుంటూరుకు చెందిన 19 ఏళ్ల షేక్‌ మహమ్మద్‌ జాకీర్‌ ఉన్నారని సీఐ తెలిపారు. ఈ నలుగురు విజయవాడలో కారు అద్దెకు తీసుకుని అరకు వెళ్లి అక్కడ గంజాయి కొనుగోలు చేశారు. తిరిగి వస్తుండగా ఊర్వశి జంక్షన్‌ సమీపంలోని సుభాష్‌నగర్‌ వద్ద ప్రమాదం జరిగింది. నిందితుల్లో ఒకరైన పెర్లి విజయవర్ధన్‌ రాజుపై ఇప్పటికే ఒంగోలులో 11 కేసులు ఉన్నాయని, మరొక నిందితుడు మహమ్మద్‌ జాకీర్‌పై కూడా గంజాయి కేసు ఉందని పోలీసులు వెల్లడించారు. యువతికి తల్లిదండ్రులు లేరు. విజయవర్ధన్‌కు బంధువు కావడంతో అతనితో ఇలా వెళ్తూ ఉంటుంది. ఈ కేసులో ప్రతిభ చూపించిన ఎస్‌ఐలు షేక్‌ సమీర్‌, రవికుమార్‌లను సీఐ అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement