
చందనోత్సవంలో సామాన్యులకే పెద్ద పీట
● హోంమంత్రి వంగలపూడి అనిత
సింహాచలం: ఈనెల 30న జరిగే చందనోత్సవంలో సామాన్య భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అప్పన్న స్వామి నిజరూపదర్శనం కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వ యంత్రాంగం పనిచేస్తోందని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. సింహగిరిపై జరుగుతున్న చందనోత్సవ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ హరేందిరప్రసాద్, సీపీ శంఖబ్రత బాగ్చిలతో కలిసి ఆదివారం పరిశీలించారు. భక్తులకు కల్పించిన సౌకర్యాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ అంతరాలయ దర్శనాలు ఉదయం 3 గంటల నుంచి 6 గంటలలోపు మాత్రమే ఉంటాయన్నారు. ఉదయం 6 తర్వాత అంతరాలయ దర్శనాలు ఉండవని స్పష్టం చేశారు. ఈ తరుణంలో అంతరాలయ తలుపులు మూసివేసి తాళాలు వేసుకుని దగ్గర ఉంచుకోవాలని ఆలయ వైదికులు, అధికారులకు సూచించారు. దివ్యాంగులు, వృద్ధులకు, ఏడాదిలోపు వయసున్న పిల్లలు ఉన్నవారికి లిఫ్టు ద్వారా తీసుకెళ్లి, దర్శనం కల్పిస్తామన్నారు. చందనోత్సవం రోజు ఏటా లక్షా 30 వేల వరకు భక్తుల సంఖ్య ఉంటోందని, ఎన్డీయే ప్రభుత్వం వచ్చాక శ్రీశైలం, కోటప్పకొండ, శ్రీకాళహస్తి, విజయవాడ, తిరుపతి తదితర ప్రముఖ క్షేత్రాల్లో భక్తుల సంఖ్య దాదాపు 30 శాతం పెరిగిందన్నారు. దీంతో సింహాచలంలో ఈసారి చందనోత్సవానికి సుమారు రెండు లక్షల మంది వస్తారని అంచనా వేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో జేసీ మయూర్ అశోక్, దేవదాయశాఖ ఇన్చార్జి కమిషనర్ కె.రామచంద్రమోహన్, దేవస్థానం ఈవో కె.సుబ్బారావు పాల్గొన్నారు.
2 వేల మందితో బందోబస్తు
చందనోత్సవానికి 2 వేల మందితో బందోబస్తు కల్పిస్తున్నట్లు సీపీ శంఖబ్రత బాగ్చి తెలిపారు. భక్తులకు ఇబ్బంది లేకుండా దర్శనాలు కల్పించడం జరుగుతుందన్నారు.