కందుకూరు: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీలో భాగంగా మండల పరిధిలోని కొత్తగూడకు పంపించిన కార్డుల్లో ఊరి పేరు మారిపోయింది. కొత్తగూడలో పాత, కొత్త కార్డులు అన్ని కలిపి 460కి పైగా ఉన్నాయి. కాగా శనివారం రెవెన్యూ అధికారులు జీపీఓల ద్వారా వీటిని పంపిణీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఇందుకోసం గ్రామంలో డప్పు చాటింపు వేయించి, వాట్సప్ గ్రూపుల ద్వారా కూడా సమాచారం అందించారు. తీరా పంపిణీ చేయడానికి చూసే సమయంలో కొత్తగూడ గ్రామం బదులు కూపర్చంద్గూడ అని ఉండటంతో అవాక్కయ్యారు. దీంతో కార్డులు పంపిణీ చేయకుండా ఆపేశారు. అప్పటికే కొందరికి అందజేసిన కార్డులను కూడా వెనక్కి తీసుకున్నారు. అసలు కూపర్చంద్గూడ అనే గ్రామం ఎక్కడ ఉందో కూడా తమకు తెలియదని స్థానికులతో పాటు కార్యక్రమానికి హాజరైన పలువురు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆగ్రామం లేకపోయినా ఆ పేరుతో రెవెన్యూ గ్రామం మాత్రం ఉంది. ఇది జైత్వారం నుంచి పులిమామిడికి వెళ్లే దారిలో ఉత్తరం వైపున ఉంటుంది. గ్రామం లేకుండా కేవలం రెవెన్యూ కొంత విస్తీర్ణంలో మాత్రమే ఉంటుంది. దీంతో చాలా మంది ఆ గ్రామం ఎక్కడ ఉందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. జనాభా లేకుండా కేవలం ఇలా రెవెన్యూ గ్రామాలు కందుకూరు మండలంలో కూపర్చంద్గూడతో పాటు నేదునూరు గ్రామ పరిధిలోని అలిఖాన్పల్లి, అక్బర్జా రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.
స్మార్ట్ రేషన్ కార్డుల్లో కొత్తగూడ బదులు కూపర్చందర్గూడ
ఇచ్చిన కార్డులు వాపస్ తీసుకున్న అధికారులు


