భక్తులతో కిక్కిరిసిన సప్తకొలనులు
బషీరాబాద్: జిల్లా సరిహద్దులోని నీళ్లపల్లి అటవీ ప్రాంతంలో కొలువుదీరిన ఏకాంబరి రామలింగేశ్వర స్వామి జాతర సోమవారం భక్తజన సంద్రంగా మారింది. తెలంగాణ, కర్ణాటక సరిహద్దు గ్రామాల నుంచి వేలాదిమంది భక్తులు తరలివచ్చి సప్తకొలనుల్లో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం భక్తులు యాకూబ్సాబ్ దర్గాను సందర్శించారు. పూలు, పండ్లు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. పూలతో సుందరంగా అలంకరించిన స్వామివారి రథాన్ని భక్తులు ఆలయ పరిసరాల్లో ఘనంగా ఊరేగించారు. జాతరలో మిఠాయిలు, గాజులు, ఆటబొమ్మల దుకాణాలు కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. ప్రభుత్వ చీఫ్విప్ పట్నం మహేందర్రెడ్డి, ఎమ్మెల్యే బుయ్యని మనోహర్రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తాండూరు రూరల్ సీఐ ప్రవీణ్కుమార్రెడ్డి ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, నీళ్లనల్లి, జలాల్పూర్, ఇస్మాయిల్పూర్ గ్రామాల సర్పంచులు వేణుగోపాల్రెడ్డి, జయవీర్లాల్, నామ్యానాయక్, నీళ్లపల్లి గ్రామ నాయకులు సుధాకర్రెడ్డి, రుక్మారెడ్డి, గోపాల్రెడ్డి, మధుసూధన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
దేవుడి వద్ద రాజకీయాలా?
ఏకాంబరి రామలింగేశ్వర ఆలయం పేరున యువత ట్రస్ట్ ఏర్పాటు చేసి సేవ చేస్తుంటే రాజకీయాలు చేస్తారా అని ట్రస్ట్ ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఆలయం వద్ద ట్రస్ట్ అధ్యక్షుడు శ్రీశైలం మాట్లాడారు. ఏడేళ్ల నుంచి రూ.10 లక్షలతో ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. అయితే ఆలయ చైర్మన్ రాజకీయాలు చేస్తున్నారని, ఇది సరికాదన్నారు. కార్యక్రమంలో ట్రస్ట్ ఉపాధ్యక్షుడు ప్రవీణ్కుమార్, సభ్యులు వెంకట్నాయక్, గురుప్రసాద్, పీకే శ్రీనివాస్, శ్రీకాంత్ పాల్గొన్నారు.
ఏకాంబరి రామలింగేశ్వరుడి దర్శనానికి భక్తుల బారులు
సప్తకొలనుల్లో పుణ్యస్నానాలు
యాకూబ్సాబ్ దర్గాలో పూజలు
కనుల పండువగా రథోత్సవం


