యూనిట్ల కేటాయింపు ఇలా..
వికారాబాద్: రాయితీ వ్యవసాయ యంత్రాల జాడ కనిపించడం లేదు. కేంద్ర ప్రభుత్వం ఏడాది క్రితం దరఖాస్తులు స్వీకరించి మిన్నకుండి పోయింది. 50శాతం సబ్సిడీతో మహిళా రైతులకు ఈ పథకం వర్తింపజేయాలని నిర్ణయించింది. కిసాన్ సంఘాలు, స్వయం సహాయక సంఘాల ద్వారా యంత్రాల కొనుగోలుకు అవకాశం కల్పించింది. కానీ ఆ దిశగా అడుగులు మాత్రం పడలేదు. పదేళ్ల క్రితం వరకు రాష్ట్ర ప్రభుత్వం యంత్రలక్ష్మి పేరిట రైతులకు వ్యవసాయ పరికరాలు అందిస్తూ వచ్చింది. రైతు బంధు, రైతు బీమా పథకాల అమలుతో రాయితీలకు స్వస్తి పలికింది. నెల రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వం కొంత మంది రైతులకు వ్యవసాయ పరికరాలు అందజేసి చేతులు దులుపుకొంది.
అర్హులు ఎవరంటే..
కేంద్ర ప్రభుత్వం 2024 – 25 వ్యవసాయ సంవత్సరానికి గాను జిల్లాకు 454 యూనిట్లు మంజూరు చేసింది. ఈ పథకం కింద రూ.3 వేల నుంచి రూ.5 లక్షల వరకు రాయితీ ఇవ్వాలని నిర్ణయించింది. కేవలం మహిళా రైతులకే పథకం అమలయ్యేలా ఆదేశాలు జారీ చేసింది. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల ప్రాతిపదికన యూనిట్లను కేటాయించగా మిగతా సామాజిక వర్గాలకు జనరల్ కేటగిరి కింద మంజూరు చేయాలని నిర్ణయించింది. చిన్న, సన్నకారు, పెద్ద రైతులు కూడా అర్హులని తెలిపింది. ఎకరం కంటే ఎక్కువ భూమి కలిగిన రైతులు రూ.లక్ష కంటే ఎక్కువ రాయితీ వర్తించే యంత్ర పరికరాలకు అర్జీ పెట్టుకోవచ్చు. డ్రోన్లు, మినీ ట్రాక్టర్లు కావాలంటే కనీసం రెండున్నర ఎకరాల భూమి ఉండాలి. జిల్లా స్థాయి కమిటీ లబ్ధిదారులను ఎంపిక చేసేలా విధివిధానాలు రూపొందించారు.
ఏడాది క్రితం మహిళా రైతుల నుంచి దరఖాస్తుల స్వీకరణ
50శాతం సబ్సిడీతో వ్యవసాయ పరికరాలు
రూ.3 వేల నుంచి రూ.5 లక్షల వరకు లబ్ధి
జిల్లాకు 454 యూనిట్లు మంజూరు
జిల్లాకు 454 యూనిట్లు మంజూరు కాగా జనరల్ క్యాటగిరి కింద(చిన్న, సన్నకారు, పెద్ద రైతులు) 338 యూనిట్లు కేటాయించారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మహిళా రైతులకు 77 యూనిట్లు, ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన చిన్న, సన్నకారు, పెద్ద రైతులకు 39 యూనిట్లు కేటాయించారు. వికారాబాద్ నియోజకవర్గానికి ఎస్సీలకు 25, ఎస్టీలకు 11, జనరల్కు 116 మొత్తం 152 యూనిట్లు కేటాయించారు. పరిగి నియోజకవర్గానికి ఎస్సీలకు 17, ఎస్టీలకు 9, జనరల్ 77 మొత్తం 103 యూనిట్లు కేటాయించారు. కొడంగల్ నియోజకవర్గానికి ఎస్సీలకు 20, ఎస్టీలకు 11, జనరల్లకు 79 మొత్తం 110 యూనిట్లు కేటాయించారు. తాండూరు నియోజకవర్గానికి ఎస్సీలకు 15, ఎస్టీలకు 8, జనరల్ మహిళలకు 64 యూనిట్లు మొత్తం 89 యూనిట్లు మంజూరయ్యాయి. ఇందులో స్ప్రేయర్లు, నాగలి, గొర్రు, ఎరువులు, విత్తనాలు వేసే పరికరాలు, పురుగు మందు స్ప్రే చేసే డ్రోన్లు కూడా ఉన్నాయి. పవర్ వీడర్లు, బ్రష్ కటర్లు తదితర యంత్రాలను రాయితీపై ఇవ్వాలని నిర్ణయించారు. వీటి కోసం జిల్లా రైతులు ఏడాదిగా ఎదురు చేస్తున్నారు.


