898 సంఘాలకు రూ.31.96 కోట్ల వడ్డీలేని రుణాలు మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు జానకి
బషీరాబాద్: మహిళల ఆర్థిక సాధికారతే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు జానకి అన్నారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు బ్యాంకు లింకేజీ, సీ్త్ర నిధి ద్వారా వడ్డీలేని రుణాలు అందిస్తున్నట్లు తెలిపారు. బుధవారం బషీరాబాద్లో గ్రామ సమాఖ్య అధ్యక్షులు, ఏపీఎం పద్మారావు, బీటీసీ రాములు, సీసీలతో కలిసి స్వయం సహాయక సంఘాల ఆర్థిక పురోగతిపై సమీక్ష నిర్వహించారు. మండలంలో ప్రస్తుతం 907 స్వయం సహాయక సంఘాలు, 43 దివ్యాంగుల సంఘాలు, 16 వృద్ధుల సంఘాలు పనిచేస్తున్నాయని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 898 స్వయం సహాయక సంఘాలకు రూ.31.96 కోట్ల వడ్డీలేని రుణాలు అందించేందుకు లక్ష్యంగా నిర్ణయించగా, ఇప్పటి వరకు 82 సంఘాలకు రూ.6.43 కోట్ల రుణాలు మంజూరు చేసినట్లు వెల్లడించారు. సంఘాల పనితీరు, రుణాల సకాలంలో చెల్లింపుల ఆధారంగా ఒక్కో సంఘానికి గరిష్టంగా రూ.20 లక్షల వరకు వడ్డీలేని రుణం అందజేస్తామని చెప్పారు. ఈ నిధులను స్వయం ఉపాధి, చిన్నతరహా పరిశ్రమలు, ఆదాయ వృద్ధికి వినియోగించుకోవాలని సూచించారు. అర్హులు సంఘంలో సభ్యురాలిగా చేరాలని పిలుపునిచ్చారు. గ్రామాల్లో 15 నుంచి 18 ఏళ్ల కిషోర బాలికలు సంఘాల్లో చేరితే వారి ఉన్నత విద్య కోసం ఎడ్యుకేషన్ లోన్లు అందించే అవకాశం ఉందన్నారు. జిల్లాలోని మహిళా సమాఖ్యలకు ప్రభుత్వం ఇప్పటికే బస్సులు అందించిందని, వాటి ఈఎంఐలను ఆర్టీసీ చెల్లిస్తోందని తెలిపారు. సమావేశంలో సీసీలు సేవ్యానాయక్, రాములు, అంపయ్య, బీమ్లానాయక్, కవిత, జగదీశ్, కృష్ణయ్య, సుల్తానా, నర్సమ్మ, మండల సమాఖ్య కార్యదర్శి స్వాతి, కోశాధికారి సావిత్రమ్మ, గ్రామ సమాఖ్య అధ్యక్షులు, వీఓఏలు పాల్గొన్నారు.
అర్హులు సంఘంలో చేరాలి


