మహేశ్వరం: మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో ఇంటర్మీడియెట్ పరీక్ష కేంద్రం కొనసాగుతోంది. శుక్రవారం పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రాలను మహేశ్వరం ఠాణా నుంచి ఉదయం 8.45 గంటలకు స్కూల్ చీఫ్ సూపరింటెండెంట్ ఈ.గోపి తీసుకురావాల్సి ఉంది. ఆయన వాటి కోసం వెళ్లకుండా ఉదయం 10 గంటలకు నేరుగా పరీక్ష కేంద్రానికి చేరుకున్నారు. ఈ విషయమై పరీక్షల మండల కస్టోడియన్ అధికారి నర్సయ్యను వివరణ కోరగా ఉదయం 8.45 గంటలకు మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్, పరీక్షల చీఫ్ సూపరింటెండెంట్ గోపి స్టేషన్ నుంచి పేపర్లు తీసుకురావాల్సి ఉండగా హాజరు కాలేదు. పరీక్ష కేంద్రం డిపార్ట్మెంటల్ అధికారి ఒక్కరే పోలీస్ స్టేషన్ నుంచి పరీక్ష పత్రాలను తీసుకొని వెళ్లారు. మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్, చీఫ్ సూపరిండెంట్ గోపి సమయానికి రాకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై ఉన్నతాధికారులకు సమాచారం అందించినట్టు చెప్పారు. ఈ విషయమై గోపిని వివరణ కోరగా తాను ఆలస్యంగా వస్తున్నానని కస్టోడియన్ అధికారికి సమాచారం అందించానని, డిపార్ట్మెంటల్ అధికారితో పరీక్ష పత్రాలు తీసుకొని పరీక్ష సజావుగా నిర్వహించాలని కోరానని తెలిపారు. కాగా, విధుల్లో నిర్లక్ష్యం చేసినవారిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
అగ్ని ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి
అగ్నిమాపక కేంద్రం అధికారి రవీందర్రెడ్డి
చేవెళ్ల: అగ్ని ప్రమాదాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చేవెళ్ల అగ్నిమాపక కేంద్రం అధికారి రవీందర్రెడ్డి అన్నారు. పట్టణంలోని పలు పాఠశాలల్లో శుక్రవారం అగ్నిప్రమాదాల నివారణపై మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మన పరిసరాల్లో ఎలాంటి అగ్ని ప్రమాదం జరిగినా ఆందోళన చెందకుండా అప్రమత్తంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. సరైన విధంగా ఆలోచన చేసి మంటలు ఆదుపు చేయలేని పరిస్థితి ఉంటే వెంటనే ఫైర్ స్టేషన్కు సమాచారం అందించాలన్నారు. మంటలు వచ్చినప్పుడు వాటిని ఎలా ఆదుపు చేయాలో చూపించారు. అందుబాటులో ఉన్న వాటితో మంటలను ఎలా అదుపు చేయాలో చేసి చూపించారు. విద్యార్థులకు అర్థమయ్యే విధంగా మాక్ డ్రిల్ నిర్వహించారు. కార్యక్రమంలో అగ్నిమాపక సిబ్బంది, పాఠశాలల విద్యార్థులు అధ్యాపకులు పాల్గొన్నారు.


