దౌల్తాబాద్: గ్రామ పంచాయతీల్లో నిధులు లేక రెండేళ్లుగా అభివృద్ధి కుంటుపడిది. కేంద్ర ఆర్థిక సంఘం పంచాయతీలకు నిధులు విడుదల చేస్తుండడంతో పనులకు మోక్షం లభించనుంది. మండల పరిధిలోని 33 గ్రామ పంచాయతీలకు రూ.61 లక్షలు మంజూరయ్యాయి. 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్రం 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేయడంతో పంచాయతీల ఖజానాలు ఒక్కసారిగా కళకళలాడుతున్నాయి. నిధుల రాకతో పంచాయతీ పాలకవర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. కనీసం బ్లీచింగ్ కూడా కొనలేని సమయంలో ఆర్థిక సంఘం నిధుల విడుదల ఊరటనిచ్చింది. మొత్తం నిధుల్లో 60 శాతం టైడ్ నిధులుగా, 40శాతం అన్ టైడ్ నిధులుగా విడుదలయ్యాయి. టైడ్ నిధులను తాగునీటి సరఫరా, ఇళ్ల నుంచి చెత్త సేకరణ, రహదారుల నిర్మాణం వంటి పనులకు ఖర్చు చేసేందుకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. ఈ నిధులను నిబంధనల మేరకు ఖర్చు చేయాలి. వీటికి సంబంధించిన లెక్కలు పక్కాగా ఉండాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో సూచించింది. పాలనపరమైన సాధారణ ఖర్చులు, కార్మికుల వేతనాలు చెల్లించేందుకు కార్యదర్శులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు ఎదురయ్యాయి. జనాభా ప్రాతిపాదికన ఒక్కో గ్రామ పంచాయతీకి రూ.50వేల–రూ.14లక్షల వరకు జమచేసినట్లు అధికారులు తెలిపారు. జనాభా ఎక్కువగా ఉన్న గ్రామాలకు ఈ నిధులు కొంత ఊరట కలిగిస్తుండగా జనాభా తక్కువ ఉన్న చిన్న పంచాయతీలకు అరకొర నిధులు రావడంతో నిరాశ చెందుతున్నారు.
గ్రామ పంచాయతీలకు
15వ ఆర్థిక సంఘం నిధుల విడుదల
హర్షం వ్యక్తం చేస్తున్న పాలకవర్గాలు
జనాభా ప్రాతిపదికన ఒక్కో గ్రామానికి రూ.50వేల నుంచి రూ.14 లక్షల వరకు జమ


