
ఒట్టేసింది నిజమే కానీ..
● రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేక హామీల అమలులో జాప్యం ● స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్
మోమిన్పేట: ఎన్నికల సమయంలో దేవుళ్లపై ఒట్టేసి హామీలు ఇచ్చిన మాట నిజమేనని కానీ.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేక హామీల అమలులో జాప్యం జరుగుతోందని స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ఏజేఆర్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చిందని.. అధికారం చేపట్టాక గత ప్రభుత్వం చేసిన ఆర్థిక విధ్వంసం బయటపడిందన్నారు. వారు చేసిన అప్పులకు వడ్డీలు కడుతూ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో దివంగత ముఖ్యమంతి వైఎస్ రాజశేఖరరెడ్డి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టును ప్రారంభిస్తే ఆ తర్వాత వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం చుక్కనీరు రాకుండానే ప్రాజెక్టును రద్దు చేసిందన్నారు. సాగునీటి వసతి లేక వికారాబాద్ జిల్లా రైతాంగం పూర్తిగా వర్షాధార పంటలపైనే ఆధారపడాల్సి వస్తోందన్నారు. గత ప్రభుత్వం జిల్లాను ఎడారిగా మార్చిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం జిల్లాలో పారిశ్రామిక వాడలను ఏర్పాటు చేసి ఈ ప్రాంత నిరుద్యోగులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తోందన్నారు. జిల్లాలోని నాలుగు ప్రధాన రహదారుల విస్తరణకు కేంద్రమంత్రి నితిన్గడ్గరీని కలిసి విన్నవించినట్లు తెలిపారు. రూ.10 వేల కోట్లతో రహదారులను అభివృద్ధి చేయనున్నట్లు వివరించారు. అనంతగిరులను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు రూ.వేయ్యి కోట్లతో మెగా సంస్థతో ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మంత్రి శ్రీధర్బాబు, మండలి చీఫ్విప్ పట్నం మహేందర్రెడ్డి, ఎమ్మెల్యే మనోహర్రెడ్డి, మర్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ మహేందర్రెడ్డి, సీనియర్ నాయకులు నరోత్తంరెడ్డి, సుభాష్గౌడ్, సురేందర్, సిరాజొద్దీన్, వేమారెడ్డి, ఎజాస్, మాణయ్య తదితరులు పాల్గొన్నారు.