ప్రభుత్వాస్పత్రి ఎదుట ధర్నా

ధర్నా చేస్తున్న బాధితులు, యువజన కాంగ్రెస్‌ నేతలు  - Sakshi

కొడంగల్‌ : యువజన కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో గురువారం స్థానిక ప్రభుత్వాస్పత్రి ఎదుట రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. పట్టణంలోని గాంధీనగర్‌ కాలనీకి చెందిన వ్యక్తి చనిపోతే పోస్టుమార్టం చేయడానికి వైద్యులు నిరాకరించినట్లు ఆరోపించారు. కొడంగల్‌లో పోస్టుమార్టం గది లేదని తాండూరుకు తీసుకెళ్లి పోస్టుమార్టం చేయించుకోవాలని వైద్యులు చెప్పినట్లు బాధితులు తెలిపారు. కొడంగల్‌లోని ప్రభుత్వాస్పత్రి స్థాయిని పెంచి 50 పడకలకు చేర్చారు. డీఎంహెచ్‌ఓ పరిధి నుంచి వైద్య విధాన పరిషత్‌లోకి మారింది. అయినా కొడంగల్‌ ఆస్పత్రిలో సమస్యలు అలాగే ఉన్నాయని యువజన కాంగ్రెస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కృష్ణంరాజు ఆరోపించారు. పేదలు చనిపోతే పోస్టు మార్టం కోసం ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లాలని చెప్పడం ఎంత వరకు సమంజమని ప్రశ్నించారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు ఆందోళన విరమించేది లేదని రోడ్డుపై బైఠాయించారు. ఎస్‌ఐ రవిగౌడ్‌ ఆందోళన చేస్తున్న వారితో మాట్లాడారు. పోస్టుమార్టం కొడంగల్‌లోనే చేయాలని డిమాండ్‌ చేశారు. వైద్యులు పోస్టుమార్టం చేస్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు. ఈ సందర్భంగా కృష్ణంరాజు మాట్లాడుతూ త్వరలో పోస్టుమార్టం గదిని నిర్మించాలని డిమాండ్‌ చేశారు. ఆస్పత్రిలో సిబ్బందిని నియమించాలన్నారు. కార్యక్రమంలో గాంధీనగర్‌ కాలనీవాసులు, యువజన కాంగ్రెస్‌ కార్యకర్తలు పాల్గొన్నారు.

Read latest Vikarabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top