ప్రాజెక్టులు తీసుకొచ్చి తాగునీరు, సాగునీరు అందించిన భగీరథుడు వైఎస్సార్
తిరుపతికి తెలుగుగంగ రెండో పైపులైన్ కోసం మంజూరు చేసిన
రూ.50 కోట్లు బాబు ఆపేశారు
ప్రజాసమస్యల పరిష్కారానికి
ఉద్యమ పోరాటాలు ఆగవు
వైఎస్సార్సీపీ చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి
తిరుపతి మంగళం : రాష్ట్రంలో చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కరువు పలకరిస్తుందని, దాంతో రాష్ట్ర ప్రజలంతా అల్లాడిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని చిత్తూరు, తిరుపతి జిల్లాల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి విమర్శించారు. తిరుపతి పద్మావతిపురంలోని పార్టీ జిల్లా కార్యాయం వద్ద గురువారం వైఎస్సార్సీపీ తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం, మాజీ మేయర్ శిరీష, పార్టీ నగర అధ్యక్షుడు మల్లం రవిచంద్రారెడ్డి, పార్టీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు నీలం బాలాజీతో పాటు పార్టీ శ్రేణులు అధిక సంఽఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భూమన మాట్లాడుతూ అధికార దాహంతో ప్రజలకు చంద్రబాబు చేస్తున్న ద్రోహం, వంచనపై భగవంతునికి, ప్రకృతికి సైతం కోపం వచ్చిందని, దాంతో సకాలంలో వర్షాలు కురవక ప్రజలు తాగునీరు కూడా లేక అల్లాడిపోతున్నారన్నారు. చంద్రబాబు ఎప్పుడూ అధికార కోసం తప్ప ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచించరన్నారు. అందుకే రాష్ట్రంలో 120 ఏళ్లలో ఎప్పుడూ లేనంతగా కరువుతో, ఏడాది పొడువునా ఉక్కపోతతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 1,400 మండలాల్లో 1,250 మండలాలను కరువు మండలాలుగా, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో 67 మండలాలు ఉంటే 66 మండలాలను కరువు మండలాలుగా ప్రకటిస్తున్నారంటే చంద్రబాబుపై ప్రకృతి కూడా ఏ విధంగా ఆగ్రహం వ్యక్తం చేస్తోందో అర్థమవుతోందన్నారు.
14 ఏళ్ల చంద్రబాబు పాలనలో రాష్ట్రమంతా కరువే
అపరభగీరథుడు వైఎస్సార్
రాష్ట్రంలో ప్రజలకు తాగునీరు, సాగునీరు అందించడానికి అనేక ప్రాజెక్టులు తీసుకొచ్చిన భగీరథుడు వైఎస్.రాజశేఖరరెడ్డి అని భూమన గుర్తుచేశారు. అప్పట్లో కండలేరు రిజర్వాయర్ దగ్గర పైప్ లైన్ ద్వారా నీరు తరలించాలని పోరాటం చేశామని, గాలేరు– నగరి కోసం 600 కి.మీ పాదయాత్ర చేశామని గుర్తుచేశారు. 2వ పైప్లైన్ ద్వారా తెలుగు గంగ నీటిని తిరుపతి ప్రజలకు అందించడానికి టీటీడీ ద్వారా రూ.50 కోట్లు తాము తీసుకొస్తే వాటిని రాజకీయ కక్షతో ఆపేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. ఇప్పటికే తిరుమలలో ఉన్న రెండు డ్యామ్లు మూడు నెలలకే సరిపోతాయని అధికారులు ప్రకటించిన విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. 25 ఏళ్ల క్రితం తిరుమలకు తాగునీటి సమస్య రావడంతో ట్యాంకర్లతో నీటిని తరలించిన పరిస్థితి చంద్రబాబు పాలనలోనే అన్న విషయాన్ని గుర్తుచేశారు. తాగునీటి సమస్యపై ప్రజల పక్షాన వైఎస్సార్సీపీ పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతుందని హెచ్చరించారు. తిరుపతిలో ఆందోళనలు చేపడుతున్నామన్న కక్షతో తమ కుటుంబ ఆస్తులపై దౌర్జన్యం చేస్తూ, తమ పార్టీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తూ జైళ్లకు పంపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొని వైఎస్సార్సీపీ విజయకేతనం ఎగురవేద్దామని పిలుపునిచ్చారు. అనంతరం పార్టీ కార్యకర్తలకు ఐడీ కార్డులు పంపిణీ చేశారు.


