● టీడీఆర్ బాండ్లలో అవకతవకలు మా దృష్టికి రాలేదు
సాక్షి టాస్క్ఫోర్స్: తిరుపతి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో గత ప్రభుత్వ హయాంలో మాస్టర్ ప్లాన్ రోడ్ల కోసం జారీచేసిన ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ (టీడీఆర్) బాండ్లలో అవకతవకలు జరిగాయని, ఇందులో ప్రజాప్రతినిధులు, అధికారుల ప్రమేయం ఉందంటూ వచ్చిన ఆరోపణలు అసెంబ్లీ సాక్షిగా అసత్యాలని తేలిపోయాయి. ఈ విషయంపై తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు సంబంధిత మంత్రిత్వ శాఖకు లిఖిత పూర్వక జవాబు కోసం నోటీసు అందించంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ శాఖ అధికారులు ఎమ్మెల్యే నోటీసుకు జవాబు ఇస్తూ తమకు విజిలెన్స్ శాఖ నుంచి టీడీఆర్ బాండ్ల కుంభకోణానికి సంబంధించి ప్రజాప్రతినిధులు, అధికారులపైన ఎటువంటి రిపోర్టులు అందలేదని సమాధానం ఇచ్చారు. దీంతో టీడీఆర్ బాండ్ల కుంభకోణం అంటూ అసత్య ప్రచారం ఉత్తదే అని తేలిపోయింది.
కొనసాగుతున్న బిల్ కలెక్టర్ల దీక్ష
తిరుపతి రూరల్: డిజిటలైజేషన్ పేరుతో ఏపీఎస్పీడీసీఎల్ అధికారులు బిల్ కలెక్టర్లను ఉద్యోగం నుంచి తొలగించడంతో వారి కుటుంబాల్లో చీకట్లు అలుముకున్నాయి. ఉద్యోగం తిరిగి ఇవ్వాలని, లేదంటే ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలని డిమాండ్ చేస్తూ గత 25 రోజులుగా కుటుంబాలతో కలిసి దీక్ష కొనసాగిస్తున్నారు. గురువారం పుత్తూరు, నాగలాపురం, పిచ్చాట్టూరు ప్రాంతాలకు చెందిన బిల్కలెక్టర్లు, వారి కుటుంబీకులు పాల్గొన్నారు.


