తిరుమల: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేతుల మీదుగా తిరుమలలోని ఎస్వీ మ్యూజియం ప్రారంభోత్సవం జరగనున్న నేపథ్యంలో టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి, ఎస్పీ సుబ్బరాయుడు, సీవీఎస్వో మురళీకృష్ణతో కలిసి గురువారం ఉదయం మ్యూజియంలోని ఏర్పాట్లను పరిశీలించారు. మ్యూజియంలో ఏర్పాటు చేసిన గ్యాలరీలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో టీటీడీ ఇన్చార్జ్ సీఈ మనోహరం, డిప్యూటీ ఈవో సోమన్నారాయణ, వీజీఓ సురేంద్ర పాల్గొన్నారు.
నూతన విమాన సర్వీస్ ప్రారంభం
రేణిగుంట: హైదరాబాద్ నుంచి విజయవాడను కలుపుతూ తిరుపతి విమానాశ్రయం నుంచి గురువారం నూతన విమాన సర్వీసును ప్రారంభించారు. ఫ్లై–91 తొలి విమాన సర్వీసును తిరుపతి విమానాశ్రయంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడు వర్చువల్గా ప్రారంభించారు. ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వారి అగ్నిమాపక విభాగం సంప్రదాయబద్ధంగా వాటర్ కెనాన్ సెల్యూట్తో తొలి విమానానికి స్వాగతం పలికారు. విమానాశ్రయ డైరెక్టర్ భూమినాథన్, ఇతర ప్రముఖులు ప్రయాణికులకు మొదటి బోర్డింగ్ పాస్ను అందజేశారు. అనంతరం కేక్ కట్ చేసి కొత్త సర్వీసును ప్రారంభించారు. ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ ఫ్లై–91 ద్వారా విజయవాడ, రాజమండ్రి, హైదరాబాద్కు ఈ అదనపు ప్రత్యక్ష కనెక్టివిటీ భక్తులకు వేగవంతమైన, మరింత సౌకర్యవంతమైన ప్రయాణ మార్గాలను అందిస్తుందని తెలిపారు.


