రేణిగుంట: గిరిజన గురుకుల ఉపాధ్యాయుడిపై అధికార పార్టీకి చెందిన ఎస్సీ సంఘం నాయకుడు దాడికి యత్నించడం రేణిగుంట మండలంలో చర్చనీయాంశమైంది. విశ్వసనీయ సమాచారం మేరకు.. రేణిగుంట విమానాశ్రయం సమీపంలోని ఏపీ గిరిజన గురుకుల రెసిడెన్షియల్ పాఠశాలలోని ఉపాధ్యాయులకు నాలుగు నెలలకు ముందు క్వార్టర్స్ను కేటాయించారు. ఆ తర్వాత ఇక్కడ తాత్కాలికంగా ఇద్దరు టీచర్లను నియమించారు. వారికి క్వార్టర్స్ను ఇవ్వకుండా నిరాకరించారు. అందులో ఒక టీచర్ భర్త తిరుపతిలోని అధికార పార్టీ నాయకుడికి అనుచరుడుగా ఉన్నారు. దీంతో అతను సీనియర్ ఉపాధ్యాయులను క్వార్టర్స్ ఖాళీ చేయాలని బెదిరింపులకు దిగాడు. ఈనెల ఆరో తేదీన సదరు నాయకుడు పాఠశాలకు చేరుకుని ప్రిన్సిపల్ ముందే ఒక ఉపాధ్యాయుడిపై దాడికి యత్నించాడు. ‘నువ్వు ఇక్కడ ఎలా ఉద్యోగం చేస్తావో నేను చూస్తా’ అంటూ బెదిరింపులకు దిగాడు. విషయాన్ని బాధిత ఉపాధ్యాయులు జిల్లా అధికారులకు నివేదించినట్లు తెలిసింది. ఈ విషయం బయటికి రావడంతో జిల్లా అధికారులు తొక్కిపెట్టారు. సదరు అధికార పార్టీ నాయకుడిని కాపాడే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇదంతా ప్రిన్సిపల్ గదిలో ఉన్న సీసీ కెమెరాల్లో నమోదైన ఫుటేజ్ని పరిశీలిస్తే అసలు విషయం తెలుస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయంపై ప్రిన్సిపల్ రవికాంత్ను వివరణ కోరగా బదులు ఇవ్వకుండా మాట మార్చి జారుకున్నారు.


