రేణిగుంట : అమర రాజా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వ్యవస్థాపక చైర్మన్ డా.గల్లా రామచంద్ర నాయుడుకు ప్రతిష్టాత్మక పద్మశ్రీ డా. యలవర్తి నాయుడమ్మ స్మారక పురస్కారం–2026 మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా అందుకున్నట్లు కంపెనీ నిర్వాహకులు తెలిపారు. తెనాలిలోని రామకృష్ణ కవి కళాక్షేత్రంలో డా.యలవర్తి నాయుడమ్మ సైనన్స్ అండ్ టెక్నాలజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫౌండేషన్ చైర్మన్ యడ్లపాటి రఘునాథ బాబు అధ్యక్షత గురువారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ప్రఖ్యాత శాస్త్రవేత్త, పద్మశ్రీ డా.యలవర్తి నాయుడమ్మ జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం వివిధ రంగాల్లో విశేష సేవలందించిన ప్రముఖ వ్యక్తికి ఈ స్మారక పురస్కారాన్ని ప్రదానం చేస్తున్నారు. అందులో భాగంగా వివిధ సేవారంగాల్లో రాణిస్తున్న డా.గల్లా రామచంద్రనాయుడును ఈ పురస్కారానికి ఎంపిక చేశారు.


