తిరుపతి సిటీ : జిల్లాలోని ప్రభుత్వ, టీటీడీ, ప్రైవేటు కళాశాలల్లో డిగ్రీ ప్రవేశాలకు సంబంధించి ఓఏఎమ్డీసీ ఆన్లైన్ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ఈనెల 18వ తేదీ వరకు గడువు పొడిగిస్తూ కమిషనరేట్ ఆఫ్ హైయ్యర్ ఎడ్యుకేషన్ బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఇప్పటి వరకు యూజీ కోర్సుల అడ్మిషన్ల కోసం దరఖాస్తు చేసుకోని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొంది.
టెట్కు 94.01శాతం హాజరు
తిరుపతి ఎడ్యుకేషన్ : ఏపీ టెట్కు ఎనిమిదవ రోజైన బుధవారం 94.01శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. మొత్తం 969మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, వారిలో 58 మంది గైర్హాజరయ్యారు. దీంతో 911మంది అభ్యర్థులు పరీక్షకు హాజరైనట్టు డీఈఓ కేవీఎన్.కుమార్ తెలిపారు.
వరలక్ష్మీ వ్రతానికి నేడు టికెట్లు
చంద్రగిరి: తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో ఈ నెల 21వ తేదీన నిర్వహించనున్న వరలక్ష్మీ వ్రతానికి గురువారం ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో టికెట్లు విడుదల చేయనున్నట్లు టీటీడీ జేఈఓ శరత్ తెలిపారు. 20న ఆఫ్లైన్లోనూ టికెట్లు పొందవచ్చని చెప్పారు. వ్రత నిర్వహణ ఏర్పాట్లపై బుధవారం తిరుచానూరు ఆలయంలోని ఆస్థాన మండపంలో ఎమ్మెల్యే పులివర్తి నానితో కలిసి సమీక్షించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దర్శనం, క్యూలు, తాగునీరు, మజ్జిగ, అన్నప్రసాదం, పారిశుద్ధ్యం, భద్రత తదితర ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని జేఈఓ ఆదేశించారు. 21న శుక్రవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆస్థానమండపంలో వరలక్ష్మి వ్రతం ఆగమోక్తంగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. సాయంత్రం 6 గంటలకు పద్మావతి అమ్మవారు స్వర్ణరథంపై మాడ వీధుల్లో విహరించనున్నట్లు వివరించారు. వ్రతం సందర్భంగా అభిషేకం, అభిషేకానంతర దర్శనం, లక్ష్మీపూజ, కల్యాణోత్సవం, బ్రేక్ దర్శనం, ఊంజల్సేవను రద్దు చేసినట్లు తెలిపారు. అవసరమైన శ్రీవారి సేవకులు, పారిశుద్ధ్య, భద్రతా సిబ్బందిని సమకూర్చుకోవాలన్నారు. ట్రాఫిక్, పార్కింగ్ సమస్యలు తలెత్తకుండా పోలీసు, పంచాయతీ అధికారులతో సమన్వయం పనిచేయాలని సూచించారు. ఆలయ డిప్యూటీ ఈఓ హరీంద్రనాథ్, ఎస్ఈ నరసింహమూర్తి, డీఈ రవిశంకర్రెడ్డి, అడిషనల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సునీల్, ఏఈఓ దేవరాజులు, ఏవీఎస్ఓ శ్రీహరిరావు, కేటరింగ్ అధికారి విజయభాస్కర్ పాల్గొన్నారు.
న్యాయమూర్తులకు ఉద్యోగోన్నతి
తిరుపతి లీగల్ : తిరుపతి ఐదవ అదనపు జిల్లా జడ్జి జి.రామ్ గోపాల్, రాష్ట్ర ఎర్రచందనం కేసుల విచారణ సెషన్స్ జడ్జి ఏ.నరసింహమూర్తికి జిల్లా జడ్జీలుగా ఉద్యోగోన్నతిపై బదిలీ చేస్తూహైకోర్టు బుధవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది. రామ్ గోపాల్ను వైఎస్ఆర్ కడప జిల్లా జడ్జిగా, నరసింహమూర్తిని నెల్లూరు జిల్లా జడ్జిగా బదిలీ చేస్తున్నట్లు పేర్కొంది. ఈనెల 19వ తేదీ లోపు ఆయా ప్రాంతాల్లో బాధ్యతలు చేపట్టాలని స్పష్టం చేసింది.
తిరుపతి ఎయిర్పోర్టులో ‘ఈ–వీసా’
రేణిగుంట : తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే విదేశీ భక్తుల కోసం తిరుపతి విమానాశ్రయంలో ఈ–వీసా సేవలను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇదివరకు విదేశీ ప్రయాణికులు చైన్నె, బెంగళూరు, హైదరాబాద్కు వెళ్లి ఈ–వీసా ప్రక్రియ ముగించుకుని తిరుపతికి వచ్చేవారు. ఇకపై నేరుగా తిరుపతి విమానాశ్రయానికే వచ్చి ఈ–వీసా ప్రక్రియ పూర్తి చేసుకునే వెసులుబాటు లభించింది. అంతర్జాతీయ విమాన సర్వీసులు లేనప్పటికీ కేంద్ర పౌర విమానయాన శాఖ ముందస్తుగా ఈ–వీసా కౌంటర్ను మంజూరు చేయడంపౌ పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


