తిరుపతి కల్చరల్ : భారత రక్షణ రంగం– సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమ (ఎంఎస్ఎంఈ)లతో నూతన యుగం అనే అంశంపై బుధవారం తిరుపతిలోని ఓ ప్రైవేట్ హోటల్లో రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించా రు. తిరుపతి ప్రాంతంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రక్షణ తయారీ, రక్షణ ఎగుమతుల్లో లభిస్తున్న వ్యాపార అవకాశాలను వివరించి, వాటిని మరింత పోటీతత్వం కలిగిన సంస్థలుగా తీర్చిదిద్దడంపై అవగాహన కల్పించారు. పరిశ్రమలు, వాణిజ్యం, ఎగుమతుల ప్రోత్సాహక శాఖ డైరెక్టర్ శుభమ్ బన్సల్ ముఖ్య అతిథిగా వర్చువల్ విధానంలో మాట్లాడారు. ప్రభుత్వం ఇప్పటికే సమగ్ర పారిశ్రామిక వాతావరణం ఏర్పాటు చేసిందన్నారు. రక్షణ ఉత్పత్తి విభాగం డిప్యూటీ డైరెక్టర్ జనరల్ కేకే యాదవ్ మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్లో రక్షణ రంగానికి రూ.7 లక్షల కోట్లకు పైగా కేటాయించగా, మూలధన కొనుగోలు బడ్జెట్లో 75 శాతం, అంటే సుమారు రూ.1.39 లక్షల కోట్లను దేశీయ పరిశ్రమల నుంచే కొనుగోలు చేయడానికి కేటాయించినట్లు వివరించారు. ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్ డీజీఎం జి.ప్రసాద రెడ్డి, చాంబర్స్ ఆఫ్ కామర్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ బి.రాజశేఖర్, వీకే చౌదరి, బాలాజీ, రజితారెడ్డి పాల్గొన్నారు.


