తిరుపతి మంగళం : చిన్నపిల్లల నుంచి యువత వరకు మత్తు పదార్థాలను నిషేధించి జీవితాన్ని బంగారుమైయంగా తీర్చిదిద్దుకోవాలని సినీనటుడు సుమన్ సూచించారు. దేశం మొత్తం డ్రగ్స్ వైరలైపోయిందని, స్కూల్ పిల్లలకు సైతం చాక్లెట్లలో డ్రగ్స్ పెట్టి విక్రయిస్తున్నారన్నారు. అమ్మేవాడికి పి ల్లలు ఏమైపోయినా పర్వాలేదు, కానీ వాడికి డబ్బు కావాలి.. కోటీశ్వరుడైపోవాలన్న ఆశతోనే ఇలా చేస్తున్నారన్నారు. డ్రగ్స్ సమాజంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయన్నారు. యువతరాన్ని బలితీసుకుంటున్నాయని చెప్పారు. ఆయన నటించిన ధర్మస్థల నియోజకవర్గం సినిమా ప్రమోషన్లో భాగంగా గురువారం తిరుపతిలో పర్యటించారు. ఈ సందర్భంగా డ్రగ్స్కు వ్యతిరేకంగా తిరుపతి అక్కారంపల్లి నుంచి మంగళం వరకు చిత్రం యూనిట్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా రూపొందించిన ద్విచక్రవాహనంతో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కరకంబాడి మార్గం నుంచి తిరుమలనగర్కు వెళ్లే మార్గానికి చిత్ర యూనిట్ అధ్వర్యంలో చేపట్టిన రోడ్డు మరమ్మతుల పనుల్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సామాజిక భాధ్యతతో రోడ్డుకు మరమ్మతులు చేయడం ద్వారా చిత్ర ప్రమోషన్స్ను ప్రారంభించామన్నారు. సమాజంపై డ్రగ్స్ ప్రభావం అంశాన్ని స్పృషిస్తూ, పొలిటికల్ ఎంటర్టైనర్గా దర్శకుడు జై జ్ఞానప్రభ తోట రూపొందించిన ఈ సినిమా అన్నివర్గాలను చేరుతుందన్నారు. సామాజిక బాధ్యతతో గతంలో దర్శకుడు టి.కృష్ణ తీసిన సినిమాల తరహాలో ఈ సినిమా ఉంటుందన్నారు. యువతపై డ్రగ్స్ ఎలాంటి ప్రభావం చూపుతున్నాయని, వారి తల్లిదండ్రుల పరిస్థితి ఏమిటన్న అంశాలను దర్శకుడు బలంగా చెప్పాడన్నారు. నిర్మాత మేరుం భాస్కర్ అత్యుత్తమ నిర్మాణ విలువలతో సినిమాను నిర్మించారన్నారు. ప్రతి ఒక్కరూ సినిమాను థియేటర్లలో చూడాలని కోరారు. అనంతరం తిరుమలనగర్లోని ఈశాన్నేశ్వర శివాలయాన్ని ఆయన చిత్ర దర్శకుడు, నిర్మాతతో కలిసి దర్శించుకున్నారు.


