28న ఏజీ పెన్షన్ అదాలత్
తిరుపతి అర్బన్: ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన పెన్షన్ అదాలత్ కార్యక్రమాన్ని కలెక్టరేట్లో ఈ నెల 28న విజయవాడకు చెందిన ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ నేతృత్వంలో నిర్వహిస్తారని కలెక్టర్ కే.వెంకటరమణారెడ్డి తెలిపారు. ప్రభుత్వ పింఛన్లు, జనరల్ ప్రావిడెంట్ ఫండ్, గ్రాట్యుటి, ఫ్యామిలీ వెల్ఫేర్ రిటర్స్, మిస్సింగ్ డెబిట్స్ తదితర సమస్యలు పరిష్కరించనున్నట్టు తెలిపారు. అదనపు సమాచారం కోసం జిల్లా ఖజానా అధికారి 9440013592 వారిని సంప్రదించాలని ఆయన సూచించారు.
ఇంటర్ పరీక్షకు
828 మంది గైర్హాజరు
తిరుపతి ఎడ్యుకేషన్ : ఇంటర్ పబ్లిక్ పరీక్షలో భాగంగా శుక్రవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ద్వితీయ సంవత్సర విద్యార్థులకు మ్యాథ్స్–2బీ, జువాలజీ, హిస్టరీ సబ్జెక్టుల్లో పరీక్ష జరిగింది. ఈ పరీక్షకు ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా 141 పరీక్షా కేంద్రాల్లో జనరల్లో 32,381 మంది, ఒకేషనల్లో 3,113, మొత్తం 35,494 మంది విద్యార్థులు హాజరవ్వాల్సి ఉంది. వీరిలో 828 మంది గైర్హాజరైనట్టు ఆర్ఐఓ వీ.రమేష్ తెలిపారు. ఈ పరీక్షలో భాగంగా శనివారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రథమ సంవత్సర విద్యార్థులకు ఫిజిక్స్, ఎకనామిక్స్ సబ్జెక్టుల్లో పరీక్ష జరుగుతుందని ఆర్ఐఓ తెలిపారు.