యాదాద్రి బ్రహ్మోత్సవాలకు వేళాయె.. | Yadadri Brahmotsavam to be held in March | Sakshi
Sakshi News home page

యాదాద్రి బ్రహ్మోత్సవాలకు వేళాయె..

Dec 23 2024 3:35 AM | Updated on Dec 23 2024 3:12 PM

Yadadri Brahmotsavam to be held in March

మార్చిలో ఉత్సవాల నిర్వహణ

ప్రముఖులతో ప్రవచనాలు, సంగీత విభావరి  

ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలకు రూపకల్పన 

దేశ, విదేశ భక్తులకు ఆకట్టుకునేలా ఏర్పాట్లు  

సాక్షి, యాదాద్రి: వచ్చే ఏడాది మార్చిలో యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనర్సింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించేందుకు దేవస్థానం ఏర్పాట్లు ప్రారంభించింది. మార్చి 1 నుంచి 11వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు. ఉత్సవాల్లో దేశ విదేశాలతో పాటు స్థానిక భక్తులను మమేకం చేయనున్నారు. బ్రహ్మోత్సవాలకు తలమానికంగా ఉండేలా కార్యక్రమాలను రూపొందిస్తున్నారు. 

స్వస్తివచనంతో ప్రారంభం  
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనర్సింహస్వామి వార్షిక బ్రహ్సోత్సవాలు మార్చి 1న స్వస్తి వచనంతో ప్రారంభమై.. డోలోత్సవంతో ముగుస్తాయి. ఈ సందర్భంగా సాహితీ, సాంస్కృతిక, ధార్మిక సభా కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. 7న శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఎదుర్కోలు, 8న స్వామి అమ్మవార్ల తిరుకల్యాణోత్సవం, 9న దివ్యవిమాన రథోత్సవం, 10న పూర్ణాహుతి, చక్రతీర్థం, దోపు ఉత్సవం, 11న శతఘటాభిõÙకం, డోలోత్సవంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.  

గ్రామోత్సవం పేరుతో రథోత్సవం 
యాదగిరిగుట్ట, పరిసర ప్రాంత భక్తుల కోసం గ్రామోత్సవం పేరుతో కొండ కింద ప్రత్యేక రథోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా కొండపైన జరిగే రథోత్సవం అనంతరం కొండ కింద భక్తుల కోసం ప్రత్యేక రథోత్సవం నిర్వహించడానికి దేవస్థానం ఏర్పాట్లు చేస్తోంది. సాంస్కృతిక కార్యక్రమాలు బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులను అలరించేలా సాంస్కృతిక, సాహితీ, సంగీత, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు రూపకల్పన చేస్తున్నారు. 

ఈ విషయంలో దేవస్థానం ఈవో ఎ.భాస్కర్‌రావు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. మూడు రోజుల పాటు మహాసహస్ర అవధాని పద్మశ్రీ గరికపాటి నర్సింహారావు ప్రవచనాలు వినిపించనున్నారు. మార్చి 6న సంగీత దర్శకుడు మాధవపెద్డి సురేశ్‌ సంగీత విభావరి ఏర్పాటు చేశారు. 

ఆయనతోపాటు తిరుపతి తిరుమల దేవస్థానంలో అన్నమాచార్య కీర్తనలు ఆలపించే ప్రముఖ గాయకుడు గరిమెళ్ల బాలకృష్ణప్రసాద్‌తో ప్రత్యేక కార్యక్రమం ఉంటుంది. అంజన్న చరిత్ర గాయని, కరీంనగర్‌కు చెందిన తేలు విజయతో ఒకరోజు, లిటిల్‌ మ్యూజీషియన్‌ నిర్వాహకుడు రామాచారితో ప్రత్యేక విభావరి కార్యక్రమాలు ఉంటాయి. 

వేగంగా స్వర్ణ కవచం పనులు  
ఆలయ విమాన గోపురం స్వర్ణకవచం పనులు వేగం పుంజుకున్నాయి. ఫిబ్రవరి నాటికి పనులు పూర్తి చేయాలన్న సంకల్పంతో దేవస్థానం ఉంది. ఈ మేరకు 60 కిలోల బంగారాన్ని వినియోగిస్తున్నారు. భక్తులు ఇచ్చిన విరాళాలు, దేవస్థానం వద్ద ఉన్న బంగారం, వెండితో స్వర్ణతాపడం పనులు కొనసాగుతున్నాయి. 10,500 చదరపు అడుగుల మేరకు చేయాల్సిన స్వర్ణ తాపడం పనులు సగం వరకు పూర్తి కావొచ్చాయి.

కనీవినీ ఎరుగని రీతిలో ఏర్పాట్లు 
శ్రీ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలుకనీవిని ఎరుగని రీతిలో నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రధానంగా లబ్ధప్రతిష్టులైన కళాకారులతో కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. బ్రహ్మోత్సవాలకు ప్రత్యేక అలంకారంగా ఈ కార్యక్రమాలు నిర్వహించనున్నాం. ఇప్పటికే గరికపాటి, మాధవపెద్ది సురేశ్‌ తదితర ప్రముఖుల సహాయాన్ని తీసుకున్నాం. మరికొందరు ప్రముఖులతో కార్యక్రమాలు రూపొందిస్తున్నాం. 
 – ఎ.భాస్కర్‌రావు, ఈవో యాదగిరిగుట్ట దేవస్థానం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement