జాయింట్ సర్వే చేసేవరకూ వద్దంటున్న సొసైటీ
హైదరాబాద్: సంయుక్త సర్వే నిర్వహించి సరిహద్దుల గుర్తింపు ప్రక్రియ పూర్తయిన తర్వాతే స్థలాన్ని వేలం వేయాలంటూ ఇద్దరు క్లెయిమ్దారులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో బంజారాహిల్స్ రోడ్డునెంబర్–12లోని ఏసీబీ కార్యాలయం ఎదురుగా ఉన్న ఎనిమిది ఎకరాల 24 గుంటల స్థలం వేలం ప్రక్రియ సందిగ్ధంలో పడింది. ఈ స్థలానికి సంబంధించి పలు అభ్యంతరాలు వ్యక్తంచేస్తూ రెండు సొసైటీలు తమ అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నాయి. దీంతో ఈ నెల 19న హెచ్ఎండీఏ నిర్వహించతలపెట్టిన బంజారాహిల్స్లోని రూ.1000 కోట్లు విలువ చేసే భూమి వేలంపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి.
షేక్పేట్ మండలం హకీంపేట సర్వేనెంబర్ 102/1లో ఉన్న 8.24 ఎకరాల భూమికి సంబంధించి కొంతభాగం తమ సొంత భూములతో కలిసిపోతుందంటూ యమునానగర్ కో–ఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ, థీమ్ అంబియన్స్ కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు ఆరోపిస్తున్నాయి. ఈ స్థలాన్ని ఈ నెల 19న వేలం వేయాలని హెచ్ఎండీఏ ప్రణాళికలు సిద్ధం చేసింది. నగరంలోనే అత్యంత ఖరీదైన స్థలాల్లో ఒకటిగా ఉన్న ఈ భూమి విలువ దాదాపు వెయ్యి కోట్లు ఉంటుందని అంచనా.
ఈ భూమికి ఆనుకుని ఉన్న యమునానగర్ కో–ఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ, థీమ్ అంబియన్స్ కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు డీమార్కేషన్ చేయాలని కోరుతున్నాయి. తమ పక్కనే ఉన్న ఈ భూములను సుమారు నాలుగు ఎకరాలు హెచ్ఎండీఏ వేలం వేయాలనుకుంటున్న భూమితో కలిసిపోతున్నట్లు ఈ ఇద్దరు క్లెయిమ్దారులు ఆరోపిస్తున్నారు.
జాయింట్ సర్వే నిర్వహించే వరకు వేలాన్ని నిలిపివేయాలని యమునానగర్ కో–ఆపరేటివ్ సొసైటీ ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు వారు హెచ్ఎండీఏ, రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ, హైదరాబాద్ జిల్లా కలెక్టర్కు వినతిపత్రాలు సమర్పించారు. ఈ అభ్యంతరాల నడుమ హెచ్ఎండీఏ ఈ స్థలాన్ని వేలం వస్తుందో? లేదో? వేచి చూడాల్సిందే.
చదవండి: కాంట్రాక్టులపై తెలంగాణ సర్కారు కీలక ఉత్తర్వులు


