రంగుమారిన ఎస్సారెస్పీ నీరు | The water in the Sriramsagar project reservoir suddenly turned green | Sakshi
Sakshi News home page

రంగుమారిన ఎస్సారెస్పీ నీరు

Aug 13 2024 4:38 AM | Updated on Aug 13 2024 4:38 AM

The water in the Sriramsagar project reservoir suddenly turned green

వరదలతో పాటు ఫ్యాక్టరీల వ్యర్థాలే కారణమంటున్న అధికారులు 

బాల్కొండ: శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌ రిజర్వాయర్‌లోని నీరు ఒక్కసారిగా ఆకుపచ్చ రంగులోకి మారింది. అంతేకాక ఈ నీరు దుర్వాసన వస్తోంది. ఇదే నీటిని ఆయకట్టుకు కాలువల ద్వారా సరఫరా చేస్తున్నారు. పంట భూముల్లోకి చేరిన నీటి దుర్వాసనను భరించలేక రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆ నీటి వల్ల పంటలకు తెగుళ్లు వ్యాపిస్తాయని అంటున్నారు. ఎగువ ప్రాంతాల నుంచి వరదలతో పాటు వ్యర్థాలు కొట్టుకు రావడంతో ఏటా ప్రాజెక్ట్‌లో నీరు రంగు మారుతోంది. గతేడాది సెప్టెంబర్‌ మొదటి వారంలో కూడా ప్రాజెక్ట్‌లో నీరు రంగు మారింది.  

ఎందుకు రంగు మారుతోంది.. 
ప్రాజెక్ట్‌ ఎగువన మహారాష్ట్రలోని ధర్మాబాద్‌ వద్ద గల పలు కెమికల్‌ ఫ్యాక్టరీల నుంచి వ్యర్థాలను వరదలు వచ్చిన సమయంలో గోదావరిలోకి ఎక్కువగా వదులుతున్నారు. ఈ కారణంగానే నది నీరు కలుíÙతమవుతోందని స్థానికులు, అధికారులు చెబుతున్నారు. అయితే ఆ కెమికల్‌ ఫ్యాక్టరీలను కట్టడి చేయడంలో అక్కడి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని స్థానిక అధికారులు అంటున్నారు. 

ఈ ప్రాజెక్ట్‌ నుంచి మిషన్‌ భగీరథ ద్వారా తాగునీటి అవసరాల కోసం ప్రతి రోజు 231 క్యూసెక్కుల నీటిని వదులుతారు. అలాగే ప్రాజెక్ట్‌లో చేపల వేటపై సుమారు ఐదు వేల మత్స్యకార కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. నీరు కలుషితం కావడం వల్ల ప్రాజెక్ట్‌లో చేపలు మృత్యువాత పడుతున్నాయని మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నీరు రంగు మారడంపై వెంటనే విచారణ చేపట్టాలని రైతులు, మత్స్యకారులు కోరుతున్నారు.  

కలుషితం కాలేదని నివేదిక వచ్చింది 
గత ఏడాది ఇలానే నీరు రంగు మారడంతో నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌ ప్రాజెక్టును సందర్శించారు. నీటి శాంపిళ్లను సంగారెడ్డిలోని ల్యాబ్‌కు పంపించాం. అయితే ఎలాంటి కాలుష్యం లేదని నివేదిక వచ్చి0ది. ఇప్పుడు కూడా నీరు రంగు మారింది. ఎందుకు మారుతోందో తెలియడం లేదు. ఉన్నతాధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లాం.– చక్రపాణి, ఈఈ, ఎస్సారెస్పీ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement