సుంకిశాలను పరిశీలించిన విజిలెన్స్‌ బృందం | The vigilance team inspected the sunkisala | Sakshi
Sakshi News home page

సుంకిశాలను పరిశీలించిన విజిలెన్స్‌ బృందం

Aug 19 2024 4:50 AM | Updated on Aug 19 2024 4:50 AM

The vigilance team inspected the sunkisala

పెద్దవూర: నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం పాల్తీతండా సమీపంలోని సుంకిశాల గుట్ట వద్ద నిర్మిస్తున్న భారీ ఇన్‌టేక్‌ వెల్‌ పంపింగ్‌ స్టేషన్‌ (సుంకిశాల పథకం) ప్రాజెక్టు రిటైనింగ్‌ వాల్‌ కూలిన ప్రదేశాన్ని ఆదివారం విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారుల బృందం పరిశీలించింది. నాగార్జునసాగర్‌ జలాశయంలోకి ఒక్కసారిగా నీరు పోటెత్తడం, పంప్‌హౌజ్‌ రెండో సొరంగ మార్గం నుంచి ప్రవాహం ఉధృతంగా రావడంతో సొరంగం ముందు భాగంలో నిర్మాణంలో ఉన్న గేటుతో పాటు నీరు రాకుండా రక్షణగా నిర్మించిన కాంక్రీట్‌ రిటైనింగ్‌ వాల్‌ ఈ నెల 2వ తేదీన ఒక్కసారిగా కుప్పకూలిన విషయం విదితమే. 

ఈ నేపథ్యంలో విజిలెన్స్‌ బృందం ఘటనా స్థలాన్ని పరిశీలించి విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా సంబంధిత కాంట్రాక్ట్‌ ఏజెన్సీతోపాటు ప్రాజెక్టును నిర్మిస్తున్న హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ వాటర్‌ సప్‌లై అండ్‌ సీవరేజ్‌ బోర్డ్‌ ఇంజనీర్లతో మాట్లాడి ఘటనకు సంబంధించిన వివరాలను ఈ బృందం అధికారులు తెలుసుకున్నారు. సుమారు గంటన్నరకుపైగా ఇన్‌టేక్‌ వెల్‌ చుట్టూ తిరిగి క్షుణ్ణంగా పరిశీలించారు. రిటైనింగ్‌ వాల్‌కు అమర్చిన గేటు మందం ఎంత ఉందో టేపుతో కొలిచారు. 

ఈ సందర్భంగా అధికారులు విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో విచారణను చేపట్టామ ని తెలిపారు. ఘటన ఎలా జరిగిందన్న విషయంలో పూర్తి విచారణ అనంతరం నివేదికను రూపొందించి ప్రభుత్వానికి అందిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అదనపు ఎస్పీలు డి.ఆనంద్‌కుమార్, జి.మధుసూద న్‌రావు, ఇంజినీరింగ్‌ విభాగం డిప్యూటీ డైరెక్టర్‌ జి.ప్రసాద్, వాటర్‌బోర్డ్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ రవికుమార్, సీజీఎం శ్రీధర్, జీఎం మహేశ్‌ తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement