‘వీబీ జీ రామ్ జీ చట్టాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి’ | Vb G RAM G Act Must Be Withdrawn Immediately: Uttam Kumar Reddy | Sakshi
Sakshi News home page

‘వీబీ జీ రామ్ జీ చట్టాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి’

Jun 21 2026 10:30 PM | Updated on Jun 21 2026 10:30 PM

Vb G RAM G Act Must Be Withdrawn Immediately: Uttam Kumar Reddy

సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన వీబీ-జీ రామ్-జీ చట్టం దేశంలోని కోట్లాది గ్రామీణ పేదల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదకరమైన చట్టమని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి అన్నారు.

ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ  ఉపసంఘం మొదటి సమావేశం ఇవాళ (ఆదివారం) డాక్టర్  బీఆర్‌ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ఉపసంఘం చైర్మన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. మంత్రివర్గ ఉపసంఘ సభ్యులు తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క, గడ్డం వినోద్‌లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశంలో పాల్గొన్నారు. పంచాయతీ రాజ్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దానకిశోర్, అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ మాట్లాడుతూ.. ఉపాధి హామీ చట్టం ద్వారా గ్రామీణ పేదలకు కల్పించిన హక్కులను క్రమంగా నిర్వీర్యం చేసి, రాష్ట్రాల అధికారాలను హరించేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితంగా ఈ కొత్త చట్టాన్ని తీసుకువస్తోందని ఆయన ఆరోపించారు. "ఉపాధి హామీ చట్టం కేవలం ఒక పథకం కాదు.. అది గ్రామీణ భారతదేశానికి ఆర్థిక భరోసా కల్పించిన సామాజిక విప్లవం. అలాంటి చట్టాన్ని బలహీనపరచడం అంటే రైతులు, కూలీలు, మహిళలు, స్వయం సహాయక సంఘాల సభ్యుల జీవితాలతో ఆటలాడటమే" అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ ప్రతిపాదిత చట్టం ద్వారా రాష్ట్రాల పాత్రను తగ్గించి, అన్ని అధికారాలను ఢిల్లీ చేతుల్లో కేంద్రీకరించాలనే ప్రయత్నం జరుగుతోందని ఆయన విమర్శించారు. గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాల రూపకల్పన, అమలు, పర్యవేక్షణలో రాష్ట్రాలకు ఉన్న స్వేచ్ఛను హరించడం సహకార సమాఖ్య స్ఫూర్తికి పూర్తిగా విరుద్ధమన్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరులో నుంచి మహాత్మా గాంధీ పేరును తొలగించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని మంత్రి తీవ్రంగా ఖండించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement