బనకచర్లపై కేంద్రం కీలక హామీ | Uttam Kumar Reddy Chit Chat With Media on Banakacharla Construction Project | Sakshi
Sakshi News home page

బనకచర్లపై కేంద్రం కీలక హామీ

Jun 7 2025 3:47 AM | Updated on Jun 7 2025 3:47 AM

Uttam Kumar Reddy Chit Chat With Media on Banakacharla Construction Project

లేఖ రాసిన కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్‌ పాటిల్‌ 

మీడియాతో చిట్‌చాట్‌లో వెల్లడించిన మంత్రి ఉత్తమ్‌

సాక్షి, హైదరాబాద్‌: ఏపీ ప్రభుత్వం చేపట్టిన గోదావరి – బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఫిర్యాదులపై స్పందించి కేంద్రం కీలక హామీ ఇచ్చింది. తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసే ఈ ప్రాజెక్టుకు కేంద్రం ఎలాంటి అనుమతులు, నిధులు ఇవ్వరాదని కోరుతూ నీటిపారుదల శాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గత జనవరి 22న రాసిన లేఖకు స్పందిస్తూ కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్‌ పాటిల్‌ గత నెల 28న మరో లేఖ రాశారు. ‘ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర ప్రతిపాదనలు ఏపీ నుంచి ఇంకా కేంద్రానికి అందలేదు.

అందిన తర్వాత సంబంధిత నియమ నిబంధనలు, ట్రిబ్యునల్‌ తీర్పులు, అంతర్రాష్ట్ర ఒప్పందాలతోపాటు ఏపీ పునర్విభజన చట్టంలోని వివిధ నిబంధనల కింద ఆ ప్రతిపాదనలను మా శాఖ పరిధిలోని కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) పరిశీలించాకే తగిన నిర్ణయం తీసుకుంటాం’అని ఈ లేఖలో సీఆర్‌ పాటిల్‌ హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని మంత్రి ఉత్తమ్‌ శుక్రవారం సచివాలయంలో విలేకరులతో నిర్వహించిన ఇష్టాగోష్టి సమావేశంలో వెల్లడించారు. ప్రాజెక్టుకు కేంద్రం ఎలాంటి ఆర్థిక సహాయం చేయరాదని కోరుతూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రికి సైతం లేఖ రాసినట్టు గుర్తు చేశారు. 

నీళ్ల విషయంలో బీఆర్‌ఎస్‌ ద్రోహం 
సాగునీటి విషయంలో తమ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్‌ నేతలు ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి ఉత్తమ్‌ మండిపడ్డారు. నీళ్ల విషయంలో పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలోనే తెలంగాణకు తీవ్ర అన్యాయం, ద్రోహం జరిగిందని స్పష్టం చేశారు. 2014 జూన్‌ 2 నాటికి శ్రీశైలం జలాశయం నుంచి మొత్తం 47,850 క్యూసెక్కులను మాత్రమే తరలించుకునే సామర్థ్యాన్ని ఏపీ కలిగి ఉండగా, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ సహకారంతో 2023 డిసెంబర్‌ నాటికి 1,11,400 క్యూసెక్కులకు ఏపీ పెంచుకుందని ఆరోపించారు. ఈ కాలంలో రోజుకు నీటి తరలింపు సామర్థ్యం 4.1 టీఎంసీల నుంచి 9.6 టీఎంసీలకు పెరిగిందన్నారు.

రాష్ట్ర విభజనకు ముందు 10 ఏళ్లలో శ్రీశైలం జలాశయం నుంచి 727.15 టీఎంసీలను ఏపీ తరలించుకోగా, పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో 12,01 టీంఎసీలను తరలించుకుందని లెక్కలు బయటపెట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిన రూ.64 వేల కోట్ల వృథా ఖర్చులను కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులపై చేసి ఉంటే మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లోని ప్రాజెక్టుల కింద 25,64,500 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందేదన్నారు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి నిర్వహించిన అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో నాటి తెలంగాణ సీఎం కేసీఆర్‌ హాజరై ఏపీ, తెలంగాణ మధ్య నీటి విభజనపై కృష్ణా ట్రిబ్యునల్‌–2 నిర్ణయం తీసుకునే వరకు ఇదే తాత్కాలిక సర్దుబాటు కొనసాగుతుందని చెప్పి వచ్చారని ఆరోపించారు.

గత ప్రభుత్వం రాతపూర్వకంగా ఈ తాత్కాలిక కోటాకు అంగీకరించడంతో దాన్ని తెలంగాణకు వ్యతిరేకంగా వాడుకోవడానికి ఏపీ ప్రభుత్వం కృష్ణా ట్రిబ్యునల్‌–2లో దాఖలు చేసిందన్నారు. బీఆర్‌ఎస్‌ పాలనలోనే ఏపీలోని ముచ్చుమర్రి లిఫ్టు సామర్థ్యం 3,850 క్యూసెక్కుల నుంచి 6,300 క్యూసెక్కులకు, పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ సామర్థ్యం 44వేల క్యూసెక్కుల నుంచి 92,592 క్యూసెక్కులకు పెరిగిందని చెప్పారు. బీఆర్‌ఎస్‌ సహకారంతోనే నాటి ఏపీ ప్రభుత్వం శ్రీశైలం జలాశయం నుంచి రోజుకు 3 టీఎంసీలను తరలించుకోవడానికి రాయలసీమ లిఫ్టును చేపట్టిందన్నారు.

ఈ ప్రాజెక్టు టెండర్లను అడ్డుకోవాల్సింది పోయి సజావుగా జరిగేందుకు గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సహకరించిందని, ఇందుకోసం టెండర్లకు ముందు జరగాల్సిన అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశాన్ని వాయిదా వేయాలని కేంద్రానికి లేఖ రాసిందన్నారు. బీఆర్‌ఎస్‌ వారు తమ ప్రభుత్వంపై గోబెల్స్‌ ప్రచారం చేస్తున్నారని, గోబెల్స్‌కు వారసులు కావడంతో వారి పేర్లను ‘గోబెల్స్‌ రావు’గా మార్చాలని ఎద్దేవా చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement