చనిపోయాడనుకున్న వ్యక్తి.. బతికొచ్చాడు! | unidentified person died in a train accident | Sakshi
Sakshi News home page

చనిపోయాడనుకున్న వ్యక్తి.. బతికొచ్చాడు!

Jun 24 2024 6:07 AM | Updated on Jun 24 2024 6:07 AM

unidentified person died in a train accident

రైలు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి 

సెల్‌ఫోన్‌ ఆధారంగా కుటుంబీకులకు రైల్వే పోలీసుల సమాచారం 

పుట్టుమచ్చలు నిర్ధారించుకుని అంత్యక్రియలకు ఏర్పాట్లు 

అంతలోనే ఆటోలో దిగిన చనిపోయాడనుకున్న వ్యక్తి 

ఆనందంలో కుటుంబీకులు, బంధువులు  

బషీరాబాద్‌: చనిపోయాడని ఓ వ్యక్తి అంత్య క్రియలకు బంధువులు అన్ని ఏర్పాట్లు చేసు కున్నారు. మృతదేహాన్ని పొలంలో ఖననం చేసేందుకు సిద్ధమయ్యారు. చివరకు పాడె ఎత్తే సమయానికి చనిపోయాడనుకున్న వ్యక్తి ఇంటి దగ్గర ఆటోలో దిగాడు. దీంతో అక్కడున్నవారంతా ఆశ్చర్యపోయారు. ఈ విచిత్ర ఘటన వికారాబాద్‌ జిల్లా బషీరాబాద్‌ మండలం నావంద్గీ గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. 

సెల్‌ఫోన్‌ చోరీ చేసిన వ్యక్తి మరణించడంతో...
గ్రామానికి చెందిన పిట్టల ఎల్లప్ప (40) బషీరాబాద్‌లో ఓ నాయకుడి దగ్గర పశువుల కాపరిగా పనిచేస్తుండే వాడు. మూడు రోజు లుగా పనికి వెళ్లలేదు. ఇంట్లోనూ చెప్పకుండా తాండూరు వెళ్లాడు. అక్కడ అడ్డకూలీ పనికి వెళ్లి రాత్రికి తాండూరు రైల్వే స్టేషన్‌లో పడుకునేవాడు. శుక్రవారం అతడి సెల్‌ఫోన్‌ను రైల్వేస్టేషన్‌లో ఓ వ్యక్తి దొంగిలించాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి వికారాబాద్‌ రైల్వే స్టేషన్‌లో రైలు కింద పడి ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు.

మృతుడి దగ్గర లభించిన సెల్‌ఫోన్‌ ఆధారంగా రైల్వే పోలీసులు ఎల్లప్ప కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. దీంతో భార్య ఎములమ్మ, బంధువులు, గ్రామస్తులు ఆదివారం ఉదయం వికా రాబాద్‌ ఆస్పత్రికి చేరుకున్నారు. తలలేని శరీరంపై పుట్టుమచ్చలు గుర్తుపట్టి తమకు సంబంధించిన వ్యక్తి అని చెప్పడంతో శవాన్ని అప్పగించారు. అంబులెన్సులో మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లారు. కుటుంబీకులు, బంధువుల రోదనలతో ఇంట్లో వి షాదం నెలకొంది. అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తుండగానే ఎల్లప్ప తాపీగా ఆటోలో వచ్చి ఇంటి వద్ద దిగాడు. దీంతో ఎల్లప్ప సెల్‌ఫోన్‌ చోరీ చేసిన వ్యక్తి రైలు ప్రమాదంలో మృతి చెందినట్లు గుర్తించి మృతదేహాన్ని తిరిగి రైల్వే పోలీసులకు అప్పగించారు.

Advertisement
 
Advertisement
Advertisement