హైదరాబాద్: అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్ ఇద్దరి ప్రాణాలు తీసింది. కేవలం స్వయం తప్పిదం కారణంగా బైకు డివైడర్ను ఢీకొట్టడంతో జరిగిన ప్రమాదంలో ఇరువురూ స్పాట్లోనే కన్నుమూశారు. సరూర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ జరిగిన ఘటనపై ఇన్స్పెక్టర్ సైదిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..
కొత్తపేట మోహన్నగర్ ప్రజయ్ నివాస్లో ఉండే గుల్ల మధు (32), టెలిఫోన్ కాలనీకి చెందిన స్నేహితుడు కొర్నెపాటి రామచంద్ర హరీష్లు శనివారం అర్ధరాత్రి బైక్పై చైతన్యపురిలోని మరో స్నేహితుడి ఇంటికి వెళ్లారు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో మధుకు సోదరుడు పవన్ ఫోన్ చేసి ఇంకా ఇంటికి రాలేదేమిటని అడగ్గా..చైతన్యపురిలోని స్నేహితుడి ఇంట్లో ఉన్నానని చెప్పాడు. ఆదివారం తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో ఇంటికి బయలుదేరిన మధు, హరీష్లు బైకున అతివేగంగా నడుపుతూ వచ్చారు.
వీఎంహోం సమీపంలోని 1618 మెట్రో పిల్లర్ వద్దకు రాగానే అతివేగం కారణంగా బైకు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టి కిందపడిపోయారు. దీంతో తలకు తీవ్రగాయాలై సంఘటనా స్థలంలో మధు, హరీష్లు మృతిచెందారు. స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడకు చేరుకుని ఇరువురు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి మృతదేహాలను పోస్ట్మార్టంకు తరలించారు. ప్రమాద ఘటన సమీపంలోని సీసీ కెమెరాలో రికార్డు అయినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


