సాక్షి, హైదరాబాద్: ఆర్థిక మోసాల కేసుల దర్యాప్తులో సాంకేతికత వినియోగం, ఇతర సాధనాలు, డిజిటల్ ఫోరెన్సిక్ అంశంపై సీఐడీ, 3 కమిషనరేట్లకు చెందిన అధికారులకు ఐసీఏఐ–డీఏఏబీ (ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా–న్యూఢిల్లీ డిజిటల్ అకౌంటింగ్ అండ్ అష్యూరెన్స్ బోర్డు) ఆధ్వర్యంలో రెండు రోజుల శిక్షణ కార్యక్రమం గురువారం ప్రారంభమైంది. ఈ మేరకు హైదరాబాద్లోని ఐసీఏఐ భవన్ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్లో నిర్వహించిన ఈ శిక్షణ కార్యక్రమంలో సీఐడీతోపాటు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లకు చెందిన మొత్తం 40 మంది పోలీసు అధికారులు పాల్గొన్నారు.
ఈ బృందంలో ఎస్పీ, డీఎస్పీ, ఇన్స్పెక్టర్ ర్యాంకుల అధికారులు ఉన్నారు. రాష్ట్ర పోలీసు విభాగంలో తొలిసారిగా నిర్వహించిన ఈ ప్రత్యేక శిక్షణలో ఆర్థిక మోసాల కేసులను దర్యాప్తు చేస్తు న్న అధికారుల దర్యాప్తు నైపుణ్యాలను మరింత మెరుగుపరచడం, తాజా డిజిటల్ ఫోరెన్సిక్ సాధనాలను సమర్థవంతంగా ఉపయోగించేలా చేయడం లక్ష్యంగా పెట్టుకున్నట్టు సీఐడీ అడిషనల్ డీజీ చారుసిన్హా తెలిపారు. రాష్ట్రంలో ఆర్థిక మోసాల నిరోధంలో ఈ శిక్షణ కీలక మైలురాయిగా నిలుస్తుందని పేర్కొన్నారు.


