TSPSC Group 2 Exam: Decision Conclude on August 14, Says Council To HC - Sakshi
Sakshi News home page

‘గ్రూప్-2’ వాయిదానా? లేదా?.. 14న నిర్ణయిస్తాం: హైకోర్టుకు TSPSC స్పష్టీకరణ

Published Fri, Aug 11 2023 5:10 PM

TSPSC Group 2 Exam: Decision Conclude August 14 Says Council To HC - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గ్రూప్‌-2 పరీక్ష వాయిదా కోరుతున్న అభ్యర్థులు.. గురువారం తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ముందు అభ్యర్థులు తమ ధర్నాతో తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసిన సంగతి తెలిసిందే. మరోవైపు గ్రూప్‌-2 వాయిదా కోరుతూ హైకోర్టులో దాఖలైన పిటిషన్‌పై ఇవాళ విచారణ జరిగింది. మిగిలిన పరీక్షల నేపథ్యంలో గ్రూప్‌2 వాయిదా వేయాలని అభ్యర్థులు కోర్టును అభ్యర్థించగా.. ఇప్పటికే పరీక్షకు ఏర్పాట్లు పూర్తి చేశామని, ఈ తరుణంలో వాయిదా కష్టమని టీఎస్‌పీఎస్సీ కౌన్సిల్‌ తమ వాదనలు వినిపించింది.

అయితే.. గ్రూప్‌-2 పరీక్ష నిర్వాహణపై సోమవారం(ఆగష్టు 14వ తేదీ) స్పష్టమైన ప్రకటన చేస్తామని టీఎస్‌పీఎస్సీ కౌన్సిల్‌ హైకోర్టుకు స్పష్టం చేసింది. దీంతో కచ్చితంగా ఆ తేదీ తుది నిర్ణయం తీసుకోవాలని ఆదేశిస్తూ.. సోమవారానికి విచారణ వాయిదా వేసింది కోర్టు. 

అభ్యర్థుల వాదనలు..
ఈ నెల 29, 30 తేదీల్లో గ్రూప్ 2ఎగ్జామ్స్ జరగాల్సి ఉంది. అయితే.. గ్రూప్‌-2 పరీక్ష ను వాయిదా వేయాలని కోరుతూ 150 మంది అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. గురుకుల టీచర్ తో పాటు పాలిటెక్నిక్ జూనియర్ లెక్చర్ల పరీక్షల నేపథ్యంలో గ్రూప్ 2 వాయిదా కోరుతున్నారు. అగస్ట్ 2నుండి 30వరకు రకరకాల పరీక్షలు జరగనున్నాయని, గ్రూప్ 2 రాసే అభ్యర్థులు మిగిలిన పరీక్షలు కూడా రాస్తున్నారని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అన్ని పరీక్షల సిలబస్ వేరు, దీంతో అన్ని పరీక్షలకు ఒకే నెలలోనే ప్రిపేర్‌ అయి రాయడం సాధ్యం కాదు. మొత్తంలో 90 శాతం మంది అభ్యర్థులు గ్రూప్ 2 పరీక్ష నిర్వయించడాన్ని వ్యతిరేకిస్తున్నారు అని పిటిషనర్ల తరపు న్యాయవాది వాదించారు. 

Tspsc కౌన్సిల్ వాదనలు వినిపిస్తూ..  తెలంగాణ వ్యాప్తంగా గ్రూప్‌-2 పరీక్ష కోసం 5.5 లక్షలు మంది దరఖాస్తు చేసుకున్నారు. కానీ గురుకుల్ పరీక్ష కు 60 వేల మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటికే గ్రూప్-2 పరీక్ష కోసం అన్ని ఏర్పాట్లు చేశాం. 1,535 సెంటర్‌లను ఎంపిక చేశాం. పరీక్షలు జరిగే స్కూల్,కాలేజ్ లకు సెలవులు ప్రకటించాం. ఐదున్నర లక్షల మంది అభ్యర్థుల్లో.. పిటిషన్ వేసింది కేవలం 150 మంది మాత్రమే. అయినప్పటికీ ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా సోమవారం స్పష్టమైన నిర్ణయం ప్రకటిస్తాం అని టీఎస్‌పీఎస్సీ తరపు న్యాయవాది హైకోర్టుకు తెలియజేశారు. దీంతో సోమవారానికి పిటిషన్‌పై విచారణ వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు. 

ఇదీ చదవండి: టీఎస్‌పీఎస్సీ.. పరీక్షల నిర్వహణ పరీక్షే!

Advertisement
Advertisement