
వేడి, ఉక్కపోత తట్టుకోలేక ఏసీ బోగీల్లో ప్రయాణానికి మొగ్గు
మండే ఎండలతో కొలిమిని తలపిస్తున్న రైల్వే కోచ్లు
పగటి పూట ప్రయాణం అంటేనే హడలిపోతున్న ప్రజలు
నెల, నెలన్నర ముందే అయిపోతున్న థర్డ్ ఏసీ ఎకానమీ టికెట్లు
పదుల్లో ఉంటున్న వెయిటింగ్ లిస్ట్ నంబర్లతో అవస్థలు
ప్రయాణికుల రద్దీ పెరుగుతుండటంతో ఏసీ ఎకానమీ కోచ్లు పెంచుతున్న రైల్వే...
ప్రత్యేక రైళ్లను నడిపేందుకు రేక్ల కొరత
సికింద్రాబాద్–హౌరా మధ్య తిరిగే ఫలక్నుమా ఎక్స్ప్రెస్ థర్డ్ ఏసీ ఎకానమీలో నెల క్రితం వరకు 15 రోజుల ముందు కూడా టికెట్లు అందుబాటులో ఉండేవి. కానీ ప్రస్తుతం మే 15న ప్రయాణానికి వెయిటింగ్ జాబితా 85గా ఉంది. ఇక 31వ తేదీన వెళ్లాలంటే అసలు బుకింగ్కే వీల్లేకుండా ఉంది.
ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్లో మే 15న వెళ్లాలంటే వెయిటింగ్ లిస్ట్లో 47వ నంబర్ చూపుతోంది. నెలాఖరుకు ‘రిగ్రెట్’ అని చూపుతోంది. దేవగిరి ఎక్స్ప్రెస్లో ఈనెల మొత్తం వెయిటింగే చూపుతోంది. వీటిల్లో కేవలం థర్డ్ ఎకానమీ క్లాస్ మాత్రమే కాదు, ఏసీ కేటగిరీలోని ఏ తరగతిలోనూ వచ్చే నెల రోజుల్లో టికెట్లు అందుబాటులో లేవు. కానీ అల్పాదాయ వర్గాలకు అందనంత దూరంలో ఉండే వందేభారత్ రైళ్లలో మాత్రం 15 రోజుల ముందు కూడా టికెట్లు లభిస్తున్నాయి.
సాక్షి, హైదరాబాద్: రైలు ప్రయాణం అంటే ప్రజలు హడలిపోతున్నారు. నడి వేసవిలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో పగటి వేళ రైలు ప్రయాణం నరకాన్ని తలపిస్తోంది. తీవ్రమైన ఎండలతో కోచ్లు కొలిమిలా మారుతున్నాయి. ఫ్యాన్ల నుంచి వచ్చే వేడి గాలి, కిటికీల్లోంచి వీచే వడగాడ్పులు ప్రయాణికులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. చల్లటి వేళ రైలెక్కుతున్నప్పటికీ సుదూర ప్రాంతానికి ప్రయాణం చేసేవారు పగటి వేళ రైలు బోగీల్లో వేడి, ఉక్కపోతతో వడదెబ్బకు సైతం గురవుతున్నారు.
పేద, అల్పాదాయ, మధ్య తరగతి వర్గాలు రైలు ప్రయాణానికి సాధారణంగా చార్జీ తక్కువగా ఉండే జనరల్ లేదా స్లీపర్ కోచ్లనే ఎంచుకోవటం కద్దు. కాని వేసవి భగ భగలతో బోగీలు ఉడికిపోతున్న నేపథ్యంలో చార్జీ భారమైనా చాలామంది ఇప్పుడు ఏసీ కోచ్ల వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో అన్ని రైళ్లలో ఏసీ కోచ్లు నెల ముందే నిండిపోతున్నాయి.
దాదాపుగా అన్ని రైళ్లలోనూ నెల తర్వాత వెయిటింగ్ జాబితా చూపిస్తోంది. ఏసీ కోచ్లకు రోజురోజుకూ డిమాండ్ పెరుగుతుండటంతో రైల్వే శాఖ దీనిపై దృష్టి సారించింది. ప్రయాణికులకు సౌకర్యం కల్పించడంతో పాటు ఆదాయాన్ని పెంపొందించుకోవచ్చనే ఉద్దేశంతో ఏసీ ఎకానమీ క్లాస్ కోచ్ల సంఖ్య పెంచుతోంది. కొత్తగా మరిన్ని రైళ్లలో ఆ కేటగిరీని ప్రవేశపెడుతోంది.
రెండేళ్ల క్రితం నుంచి థర్డ్ ఏసీ ఎకానమీ
రైళ్లలో గతంలో ఫస్ట్ ఏసీ, సెకెండ్ ఏసీ, థర్డ్ ఏసీ.. ఇలా మూడు రకాల ఏసీ కోచ్లు మాత్రమే ఉండేవి. పేద, మధ్య తరగతి వర్గాలను దృష్టిలో పెట్టుకుని రైల్వే శాఖ రెండేళ్ల క్రితం కొత్తగా థర్డ్ ఏసీ ఎకానమీ కోచ్లను/ ప్రవేశపెట్టింది. సాధారణ థర్డ్ ఏసీ కోచ్లోని ఓ కూపేలో 8 బెర్త్లుంటే, ఎకానమీ ఏసీ కోచ్లో తొమ్మిదుంటాయి. కూపేల వైశాల్యం కూడా తగ్గించడం వల్ల ఇలాంటి ఓ కోచ్లో అదనంగా మరో కూపే ఉంటోంది. అంటే ఈ కూపే ద్వారా అదనంగా తొమ్మిది బెర్తులు అందుబాటులో ఉంటాయన్నమాట.
సాధారణ కోచ్ కంటే తక్కువ చార్జీ
సాధారణ థర్డ్ ఏసీ కోచ్ కంటే ఎకానమీ కోచ్ టికెట్ ధర తక్కువగా ఉంటుంది. ఈ కారణంగానే అల్పాదాయ వర్గాలు వేసవి వేడిని దృష్టిలో పెట్టుకుని ఈ ఎకానమీ ఏసీ కోచ్లలో ప్రయాణానికి సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే దక్షిణ మధ్య రైల్వేలో వీటి సంఖ్యను పెంచుతున్నారు. స్లీపర్ కోచ్ల సంఖ్యను కుదించటం ద్వారా ఈ తరహా కోచ్లను ఏర్పాటు చేస్తున్నారు. గత వేసవిలో జోన్ పరిధిలో ఎకానమీ కోచ్లు కేవలం 20 రైళ్లలోనే ఉండగా, ప్రస్తుతం 30కి చేరాయి.
అయినా రద్దీని తట్టుకునే పరిస్థితి లేకపోవడంతో త్వరలో మరిన్ని రైళ్లలో కూడా వీటిని ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుత డిమాండ్ నేపథ్యంలో ప్రయాణ తేదీకి 15 రోజులకు చేరువకాగానే కొన్ని ముఖ్యమైన రైళ్లలో ఏసీ కోచ్లకు టికెట్ల విక్రయం ఆపేసే పరిస్థితి నెలకొంది. ఆన్లైన్లో ‘రిగ్రెట్’ (ఐఆర్సీటీసీ పరిభాషలో బెర్తులు లేవు అని అర్ధం) అని చూపుతోంది.
సరిపడా రేక్స్ లేవు
వేసవి రద్దీ నేపథ్యంలో వివిధ ప్రాంతాలకు 100కు పైగా ప్రత్యేక రైళ్లను నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే చర్యలు చేపట్టింది. ఇప్పటికే కొన్ని నడుస్తున్నాయి. జూన్ వరకు ఈ రైళ్లు అందుబాటులో ఉంటాయి. వాస్తవానికి మరో 200 ప్రత్యేక రైళ్లను నడిపినా కూడా రద్దీకి సరిపోయే పరిస్థితి లేదు. కానీ అన్ని రేక్స్ అందుబాటులో లేవు. దీంతో అదనపు రైళ్ల విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలని రైల్వే బోర్డు స్థానిక అధికారులకు సూచించింది. వేరే ప్రాంతాల నుంచి కూడా కోచ్లను కేటాయించే పరిస్థితి లేకపోవటంతో ఈ అలర్డ్ జారీ చేసింది.
రాష్ట్రంలో 230 రైళ్ల రాకపోకలు
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి నిత్యం 230 వరకు ప్రయాణికుల రైళ్లు తిరుగుతుంటాయి. వేసవి సెలవుల నేపథ్యంలో వీటిల్లో ప్రయాణానికి ప్రతిరోజూ 30 వేల మంది వరకు అదనంగా ప్రయత్నిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో రిజర్వేషన్లు దొరక్క చాలామంది జనరల్ కోచ్లలో కిక్కిరిసి ప్రయాణిస్తున్నారు. చాలామంది అనధికారికంగా స్లీపర్ కోచ్లలో కూడా ఎక్కేస్తున్నారు. ఎండలతో ఉడికిపోతున్న బోగీలు ప్రయాణికుల కిటకిట మరింత వేడెక్కిపోతున్నాయి.
థర్డ్ ఏసీ దొరక్క పోవడంతో ఏసీ స్లీపర్ బస్సులో తీసుకున్నా
మార్చి ప్రారంభంలో కుటుంబ సమేతంగా తిరుపతి వెళ్లొచ్చాం. కేవలం వారం రోజుల వ్యవధిలోనే థర్డ్ ఏసీ టికెట్లు లభించాయి. కానీ ఇప్పుడు బెంగుళూరు వెళ్లాల్సి రావటంతో, ఆన్లైన్ రిజర్వేషన్ కోసం ప్రయతి్నస్తే రిగ్రెట్ చూపుతోంది. అసలు టికెట్లే లేవని చూపిస్తోంది. నెలన్నర ముందే ఏసీ టికెట్లు అయిపోతున్నాయి. ఎండాకాలంలో మామూలు బోగీల్లో వెళ్లాలంటే భయం వేస్తోంది. గత్యంతరం లేక ఎక్కువ చార్జీ చెల్లించి ఏసీ స్లీపర్ బస్సులో బుక్ చేసుకున్నాం. రైళ్లలో ఏసీ కోచ్ల సంఖ్య పెంచటమో, అదనపు రైళ్లను నడపటమో చేస్తే బాగుంటుంది. – జి.రవికుమార్, బాగ్లింగంపల్లి (హైదరాబాద్)