
ప్రభుత్వ టీచర్ల సమగ్ర సమాచారం సేకరణకు థర్డ్ పార్టీ
ఏప్రిల్ 21 వరకు సమగ్ర సర్వే
క్షేత్రస్థాయి వాస్తవాలు తెలుసుకోవడమే లక్ష్యం
యూడైస్ వివరాలపైనా సమగ్ర ఆరా
మే 15 కల్లా పాఠశాలలకు కార్యాచరణ ప్రణాళిక
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలోని ప్రభుత్వ ఉపాధ్యాయుల సమగ్ర సమాచారం సేకరించేందుకు థర్డ్ పార్టీతో సర్వే చేయిస్తున్నారు. ఆయా జిల్లాల్లోని డైట్ కాలేజీ విద్యార్థులకు ఈ బాధ్యతలు అప్పగించారు. ఈ నెల 15 నుంచి సమగ్ర సర్వే మొదలైంది. 21వ తేదీ వరకూ కొనసాగుతుంది. ఈ ప్రక్రియనంతా రాష్ట్ర విద్యాశాఖ పర్యవేక్షిస్తోంది. అయితే విద్యాశాఖ నిర్ణయంపై ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. పాఠశాల విద్యాశాఖ మాత్రం టీచర్ల అనుమానాల్లో అర్థం లేదని చెబుతోంది.
ఉద్దేశం ఏమిటి..?
రాష్ట్రంలో 26 వేల ప్రభుత్వ స్కూళ్లున్నాయి. వీటిల్లో మౌలిక వసతులపై కేంద్రం డేటా సేకరిస్తుంది. యునైటెడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ (యూడైస్) ద్వారా ఈ సమాచారం అందిస్తారు. ఇదంతా ఆన్లైన్లో జరుగుతుంది. స్కూల్ హెచ్ఎం ఈ డేటా క్రోడీకరిస్తారు. దీని ఆధారంగానే స్కూళ్లకు కేంద్రం నిధులు వస్తాయి. రాష్ట్ర స్కూళ్లల్లో సరైన మౌలిక వసతులు లేవని కేంద్రం కొన్నేళ్లుగా చెబుతోంది.
టాయిలెట్స్, డిజిటల్ తరగతి గదులు, తాగునీటి సదుపాయం, విద్యుత్, వంటగది, ఫర్నిచర్ ఆశించిన మేర లేవనేది కేంద్రం వాదన. మౌలిక వసతులు కల్పించినా, వాటిని యూడైస్లో నమోదు చేయడం లేదనేది విద్యాశాఖ వాదన. దీనివల్ల నష్టం జరుగుతోందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. దీనిని దృష్టిలో ఉంచుకునే సమగ్ర సర్వే చేపట్టినట్టు పాఠశాల విద్యా డైరెక్టరేట్ చెబుతోంది. యూడైస్లో వివరాలు నమోదు చేయని హెచ్ఎంలపై చర్యలు తీసుకునే యోచనలో విద్యాశాఖ ఉంది.
వివాదంగా మారిన సర్వే.
ప్రతీ జిల్లాలోనూ దాదాపు 700కుపైగా స్కూళ్లల్లో సర్వే చేపడుతున్నారు. ప్రతీ స్కూల్కు పది మందితో ఒక గ్రూపును ఏర్పాటు చేశారు. వీరు స్కూల్కు వెళతారు. ఎంఈవో ఆఫీసులో యూడైస్ రికార్డులు పరిశీలిస్తారు. హెచ్ఎంలను ప్రశ్నించే అధికారం కూడా ఇచ్చారు. వీరికి పాఠశాల విద్య శాఖ ప్రశ్నావళి ఇచ్చింది. మౌలిక వసతులు, పాఠ్యపుస్తకాల పంపిణీ, యూనిఫాం వంటి వాటి వివరాలు ఇందులో ఉన్నాయి.
స్కూళ్లల్లో ఉన్నవన్నీ యూడైస్లో నమోదు చేశారా? అనే అంశాన్ని పరిశీలిస్తారు. ఇవన్నీ ఒక ఎత్తైతే... అంతర్గతంగా మరికొంత సమాచారం కోరినట్టు టీచర్లు చెబుతున్నారు. స్కూళ్లలో పనిచేసే వారి వ్యక్తిగత సమాచారం కూడా సేకరిస్తున్నారనే ఆందోళన టీచర్లలో ఉంది. దీంతో సమగ్ర సర్వే వివాదాస్పదమైంది.
ఆందోళనలో అర్థం లేదు
యూడైస్ సమాచారంలో వాస్తవా లు తెలుసుకోవడానికి మాత్రమే సమగ్ర సర్వే చేయిస్తున్నాం. థర్డ్ పార్టీ చేత సర్వే చేస్తే అన్ని కోణాల్లో సమాచారం వస్తుంది. దీనిని చూసి టీచర్లు ఆందోళన చెందడం అర్థరహితం. ఇది ఎంతమాత్రం వారిని అవమాన పర్చడం కానేకాదు. కేంద్రానికి వెళ్లే యూడైస్ సమాచారంలో అన్నీ నమోదు కావడం లేదు. అందుకే అప్డేట్ కోసమే ఈ సర్వే. – ఈవీ నర్సింహారెడ్డి, పాఠశాల విద్య డైరెక్టర్
ఎడిట్ ఆప్షన్ ఇస్తే సరిపోతుంది
ఏళ్ల క్రితం యూడైస్లో మౌలిక వసతుల సమాచారం నమోదు చేశాం. కాలానుగుణంగా వచ్చిన మార్పులు చేర్చడానికి యూడైస్లో ఎడిట్ ఆప్షన్ లేదు. దీనిపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా చేయాల్సిన పనులకే ఈ సర్వే ఉపయోగపడుతుంది. ఇందులో టీచర్ల భాగస్వామ్యం కూడా ఉంటే బాగుంటుంది.– రాజాభాను చంద్రప్రకాశ్, ప్రభుత్వ గెజిటెడ్ హెచ్ఎం సంఘం పూర్వ అధ్యక్షుడు
ఇది సందేహించడమే
డైట్ కాలేజీల విద్యా ర్థులతో సర్వే చేయించడం టీచర్లను అవమానించడమే. డేటా నమోదులో టీచర్లు ఎందుకు నిర్లక్ష్యంగా ఉంటారు. ఒకవేళ అలాంటిది ఉంటే.. వారి దృష్టికి తేవాలి. వాస్తవ పరిస్థితులు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేయాలి. – చావా రవి, టీఎస్యూటీఎఫ్, రాష్ట్ర అధ్యక్షుడు